కొత్త ప్రాంతాలకు అంతుచిక్కని వ్యాధి: ఏలూరుకు అంటువ్యాధుల నియంత్రణ నిపుణులు: పెరిగిన రోగులు
ఏలూరు: అంతుచిక్కని వ్యాధి బారిన పడిన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు.. తేరుకోలేకపోతోంది. తగ్గినట్టే తగ్గిన వ్యాధిగ్రస్తుల సంఖ్య మళ్లీ పెరుగుదల బాట పట్టింది. గంట వ్యవధిలోనే 15 నుంచి 20 మంది అంతుచిక్కని వ్యాధి బారిన పడ్డారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. నిస్సార స్థితిలో కనిపించారు. తగ్గుముఖం పట్టిందనుకున్న ఈ వ్యాధి మళ్లీ ఒక్కసారిగా విజృంభించినట్టయింది. దీనితో మరోసారి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని వాతావరణం నెలకొంది.
ఎన్సీడీసీ నిపుణుల రాక..
ఈ పరిణామాల మధ్య నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం కొద్దిసేపటి కిందటే ఏలూరు ఆసుపత్రిని సందర్శించింది. ఎన్సీడీసీ ప్రతినిధులు ఏలూరు ఆసుపత్రికి రావడం ఇదే తొలిసారి. బృందం సభ్యులు.. ఏలూరు ఆసుపత్రి డాక్టర్లతో సమావేశం అయ్యారు. వారి నుంచి పూర్తి వివరాలను సేకరించారు. ఒక్కో పేషెంట్ వ్యక్తిగత వివరాలు.. వారికి ఇదివరకు ఉన్న వ్యాధులు, ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు. అలాగే వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో నుంచి సేకరించిన నీరు, పాలు, ఇతర ఆహార పదార్థాలు వంటి నమూనాలను పరిశీలించారు.
కొత్త ప్రాంతాలకు..
అదే సమయంలో- అంతుచిక్కని వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య పెరగడం ఆందోళనకు దారి తీస్తోంది. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఏలూరుతో పాటు దెందులూరు, పరిసర ప్రాంతాలు, గ్రామాలను ఈ అంతుచిక్కని వ్యాధి చుట్టుముట్టినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం దీని బారిన పడిన రోగుల సంఖ్య 571కి చేరుకుంది. ఇందులో 468 మంది డిశ్చార్జ్ అయ్యారు. 72 మందికి చికిత్స పొందుతున్నారు. కూరగాయల్లో రసాయనాలు, పాలల్లో కల్తీ చోటు చేసుకోవడమే కారణమని ఎయిమ్స్ నిపుణులు ప్రాథమికంగా అంచనా వేసిన విషయం తెలిసిందే.
Recommended Video
అంటు వ్యాధిలా..
ఈ అంతుచిక్కని వ్యాధి.. అంటు వ్యాదిలా మారుతోందనడానికి ఇప్పటిదాకా ఎలాంటి నమూనాలు లభించలేదు. అయినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుంచి నిపుణులను రప్పించింది ప్రభుత్వం. ఈ అంతుచిక్కని వ్యాధి అంటువ్యాధిలా మారితే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. దీన్ని ఎవరూ ధృవీకరించట్లేదు. అంటువ్యాధి కాదని, స్థానికంగా చోటు చేసుకున్న కలుషిత వాతావరణం, వారు తీసుకున్న ఆహారంలో చోటు చేసుకున్న కల్తీ ద్వారా మాత్రమే ఈ వ్యాధి పుట్టుకొచ్చిందని భావిస్తున్నారు.