Eluru Mystery Disease: ఇప్పటికీ మిస్టరీనే... ఆగని అలజడి... కోలుకున్న తర్వాత మళ్లీ ఫిట్స్..?
నాలుగు రోజులు కావొస్తున్నా ఆ వ్యాధి ఏంటన్నది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. బాధితుల్లో లక్షణాలు కూడా మారిపోతున్నాయి. కొంతమందిలో వాంతులు,నోటి నుంచి నురగలు కక్కుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే... మరికొందరిలో మూర్ఛ,నోటి వెంట రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫెక్షన్,మాస్ హిస్టీరియా కానే కాదని ఇప్పటికే వైద్యులు నిర్దారించారు. విష పదార్థాల ప్రభావమేమైనా మెదడుకు సోకి ఉంటుందా అన్న కోణంలోనూ పరిశీలన జరుపుతున్నారు.
464కి చేరిన బాధితుల సంఖ్య..
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బారిన పడిన బాధితుల సంఖ్య 464కి చేరింది. ఇందులో ఇప్పటివరకూ 263 మంది అనారోగ్యం నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అయితే కోలుకున్నవారిలోనూ కొందరు మళ్లీ ఫిట్స్కి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం (డిసెంబర్ 6) రాత్రి నుంచి సోమవారం(డిసెంబర్ 7) రాత్రి వరకు దాదాపు 147 మంది బాధితులు ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం కనిపిస్తున్న లక్షణాలతో ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్తున్నప్పనటికీ... బాధితులు ఆస్పత్రికి క్యూ కడుతూనే ఉండటం... వ్యాధి నిర్దారణ కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఫిట్స్తో పడిపోయిన నర్సు...
బాధితుల్లో ఫిట్స్,నోటి వెంట రక్తం కారడం,తలనొప్పి,నడుం నొప్పి,స్పృహ తప్పిపోవడం,గ్యాస్ సమస్యలు తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. ఏలూరు ఆస్పత్రిలో బాధితులకు వైద్య సేవలందిస్తున్న ఓ నర్సు కూడా ఫిట్స్ కారణంగా కుప్ప కూలిపోయింది. దీంతో ఆస్పత్రి సిబ్బందిలోనూ ఆందోళన నెలకొంది. మంగళవారం(డిసెంబర్ 7) సీఎం జగన్ పర్యటన సందర్భంగా కిరణ్ అనే కానిస్టేబుల్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఇలా విధుల్లో ఉన్న సిబ్బందిలోనూ వ్యాధి లక్షణాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.
విజయవాడ ఆస్పత్రిలో 12 మంది...
గుంటూరు జీజీహెచ్లో చేరిన కుసుకుమారి,లక్ష్మీ కుమారి అనే బాధితులకు రెండు గంటలకు ఒకసారి ఫిట్స్ వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఎమ్మారై స్కానింగ్ రిపోర్టుల్లో వీరి మెదడులో ఎటువంటి సమస్యలు లేవని గుర్తించామన్నారు. ప్రస్తుతం నిపుణులైన వైద్య బృందం వీరి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. ఆది,సోమవారాల్లో 12 మంది బాధితుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విజయవాడకు తరలించారు. ప్రస్తుతం అక్కడి ప్రత్యేక వార్డులో వీరికి చికిత్స అందిస్తున్నారు.
ఆ రిపోర్ట్స్ రావాల్సి ఉంది...
కలుషిత మంచినీరే ఈ సమస్యకు కారణమై ఉండవచ్చునన్న చర్చ జరుగుతుండటంతో ఇప్పటివరకు 22 నీటి శాంపిల్స్ను సేకరించి టెస్టులు చేశారు. అన్నీ నార్మల్గానే తేలాయి. అయితే ఇ-కొలి బాక్టీరియా రిపోర్టు మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటివరకూ 52 మంది బాధితుల బ్లడ్ శాంపిల్స్ పరీక్షించగా... అవి కూడా నార్మల్గానే తేలాయి. సిటీ స్కాన్ రిపోర్టులు కూడా నార్మల్గానే తేలాయి. ర్యాండమ్ మిల్క్ టెస్ట్,సెరబ్రరల్ స్పైనల్ ఫ్లూయిడ్ సీమర్ టెస్ట్ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.