ఏపీలో కరోనా పిడుగు.. ఏలూరులో మరో ఇద్దరికి వైరస్ లక్షణాలు.. వెతికితే వందల కేసులు..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్నది. తెలంగాణలో ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించినా.. బుధవారం నాటికి కొత్తగా ఇంకొన్ని కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సిటీలోని రహేజా మైండ్ స్పేస్ సెంటర్ లో ఓ టెకీకి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆఫీసు బిల్డింగ్ లో ఉన్నవాళ్లంతా ఆస్పత్రులకు పరుగులు తీశారు. ఏపీలో మొట్టమొదటి కేసు తిరుపతిలో నమోదు కాగా, బుధవారం మధ్యాహ్నానికి కాకినాడ, విజయవాడలో రెండు కేసులు నమోదయ్యాయి. అనూహ్యరీతిలో సాయంత్రానికి ఏలూరులో మరో ఇద్దరు బాధితులు ఆస్పత్రిలో చేరారు. దీనికి సంబంధించి డాక్టర్లు చెప్పిన విషయాలు గగుర్పాటుకు గురిచేసేలా ఉన్నాయి.
విషయం బయటపడిందిలా..
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కొండెపాడుకు చెందిన సత్తిరాజు అనే యువకుడు, అతనికి మామ వరుసయ్యే గురుమూర్తి మూడు రోజులుగా తీవ్రమైన దగ్గు, జలుబు, జర్వరంతో బాధపడుతున్నారు. తొలుత వాళ్లను ముదునూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా.. డాక్టర్ల విచారణలో అసలు విషయం బయటపడింది. బాధిత యువకుడు సత్తిరాజు గత నెల 18నే మస్కట్(ఒమన్) నుంచి తిరిగొచ్చాడు. గల్ఫ్ లో ఉన్నప్పుడుగానీ, లేదా విమానంలో ప్రయాణించినప్పుడుగానీ అతనికి వైరస్ సోకి ఉండొచ్చని డాక్టర్లు అనుమానించారు. దీంతో వెంటనే..
ఇంకా ఎంతమందికి?
ముదునూరు డాక్టర్లు.. జిల్లా వైద్యాధికారులకు సమాచారం ఇచ్చి.. సత్తిరాజు, గురుమూర్తిలను ఏలూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఇద్దరినీ ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, కరోనా నిర్ధారణ కోసం ఆ ఇద్దరి శాంపిల్స్ ను తిరుపతిలోని వైరాలజీ ల్యాబ్ కు పంపామని, పుణె ల్యాబ్ కు కూడా పంపే ఏర్పాట్లు చేస్తున్నామని ఏలూరు డాక్టర్లు చెప్పారు. బాధితులు ఇద్దరూ ఇంకా జ్వరం, దగ్గుతో బాధపడుతూనేఉన్నారని తెలిపారు. అయితే సత్తిరాజు, గురుమూర్తిలు గత 20 రోజుల్లో చాలా ప్రదేశాలు తిరిగామని చెప్పడంతో వైరస్ మరింతమందికి వ్యాపించి ఉంటుందేమోనని డాక్టర్లు అనుమానిస్తున్నారు.
మస్కట్-హైద్రాబాద్-రాజోలు-కొడెపాక
ఒమన్ రాజధాని మస్కట్ లో ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోన్న సత్తిరాజు.. ఈనెల 18న విమానంలో హైదరాబాద్ వచ్చాడు. స్నేహితుల దగ్గర ఓ రెండ్రోజులు గడిపి.. పశ్చిమగోదావరి జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లాడు. అక్కణ్నుంచి రాజోలుకు వెళ్లి బంధువుల ఇంట్లో ఐదు రోజులు ఉండి తిరిగి సొంతూరుకు వెళ్లాడు. ఈ ప్రయాణాల్లో చాలా చోట్ల అతని వెంట మామ గురుమూర్తి కూడా ఉన్నాడు. మూడ్రోజుల కిందట ఇద్దరూ సడెన్ గా జ్వరం బారినపడటం, స్థానిక ఆస్పత్రికి వెళితే కరోనా లక్షణాలు బయటపడటం జరిగింది. కాగా..
అందరూ ఫారిన్ నుంచి వచ్చినోళ్లే..
సత్తిరాజు, గురుమూర్తిలు గత 20 రోజులుగా ఎక్కడెక్కడ తిరుగుతూ, ఎవరెవర్ని కలిశారనేదానిపై జిల్లా యంత్రాంగం ఆరా తీస్తోంది. వీళ్ల ద్వారా ఇంకెవరికైనా వైరస్ లక్షణాలు వ్యాపించాయో లేదో శోధించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. విజయవాడలో వైరస్ లక్షణాలు బయటపడిన వ్యక్తికి కూడా ఈ మధ్యే జర్మనీ నుంచి వచ్చినవాడుకావడం, కాకినాడ కేసులోకి వ్యక్తి కూడా సౌత్ కొరియా నుంచి వచ్చినవాడే కావడం గమనార్హం. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన చాలా మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న నేపథ్యంలో ఇటీవల తిరిగొచ్చినవాళ్లలో ఎవరికైనా కరోనా లక్షణాలున్నాయా అనే విషయంపైనా అధికారులు ఆరా తీస్తున్నారు.
Recommended Video
తెలంగాణ తరహాలో..
ఇప్పటికి వెలుగు చూసిన కేసుల ఆధారంగా వాళ్ల ట్రావెల్ హిస్టరీని పట్టుకుని శోధిస్తూ పోతే వందలకొద్దీ కొత్త అనుమానిత కేసులు వెలుగుచూసే అవకాశం లేకపోలేదు. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విషయంలోనూ అతనితో సన్నిహితంగా ఉన్న 85 మందికి గాంధీ వైద్యులు టెస్టులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీలోనూ అదే తరహా జాగ్రత్తలు తీసుకునే యోచనలో ఉన్నట్లు అధికారులు చెప్పారు.