సెల్యూట్ నేతన్న.. ఇల్లు అమ్మి జాతీయ జెండా నేసిన కార్మికుడు.. ఎంత ఖర్చయ్యిందో తెలుసా..?
ఏలూరు : నాలుగేళ్లు .. రూ. ఆరున్నర లక్షల వ్యయం .. ఆహోరాత్రుల శ్రమ. చివరికి అతుకులు, బొతుకులు లేని మువ్వన్నెల జాతీయ జెండా రూపొందింది. ఏపీకి చెందిన ఓ నేతన్న ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరేసేందుకు పడిన కష్టమిదీ. ఇందులో మరో ముఖ్య విషయమేమిటంటే .. జాతీయ జెండా రూపకల్పన కోసం తన ఇంటినే విక్రయించి దేశభక్తిని చాటుకున్నాడు. ఆయన దేశభక్తిని పలువురు కొనియాడుతున్నారు. శెభాష్ నేతన్న అంటూ సెల్యూట్ చేస్తున్నారు.
మువ్వన్నెల జెండా..
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరానికి చెందిన రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ నేత కార్మికుడు. ఎప్పుడూ విభిన్నంగా దుస్తులు నేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగిరే మువ్వన్నెల జెండాను తాను నేయాలనుకొన్నాడు. అయితే ఆ జెండాకు అతుకులు లేకుండా చూడాలనుకున్నాడు. దీంతో జాతీయ జెండా రూపకల్పన కత్తి మీద సాములా మారింది. తొలుత ఎర్రకోటపై ఎగిరే జెండా సైజు తెలియకపోవడం కూడా ఖర్చు ఎక్కువయ్యేందుకు దారితీసింది. దాదాపు రూ. ఆరున్నర లక్షలను జెండా తయారీ కోసం తన సొంత డబ్బులను వెచ్చించాడు.
అపసోపాలు పడుతూ ..
ఎర్రకోటపై ఎగురవేసే జెండా సైజుపై సత్యనారాయణకు స్పష్టత లేదు. దీంతో 6 x 4 సైజు అతుకులు లేకుండా కష్టపడి నేశాడు. అయితే తర్వాత తెలిసింది ఎర్రకోటపై ఎగరవేసే జెండా 8 x 12 ఉండాలని చెప్పడంతో .. నిమిషం కూడా ఆలోచించకుండా తన పని ప్రారంభించాడు. జాతీయ జెండాను రూపొందించేందుకు ఉన్న మగ్గం సరిపోలేదు. దీంతో కొత్త మగ్గం కొనుగోలు చేశాడు. మరోవైపు జెండా సైజు ప్రకారం తయారుచేసే క్రమంలో మెటీరియల్ చాలా వేస్ట్ అయ్యింది. దీంతో చాలాసార్లు జెండా కోసం మెటీరియల్ కొనుగోలు చేశారు. ఇలా అపసోపాలు పడుతూ .. ఎట్టకేలకే జాతీయ జెండాను తయారు చేశారు.
నాలుగేళ్ల కష్టం ..
జెండా రూపకల్పన కోసం వ్యయం ఎక్కువైంది. ఇందుకోసం ఎవరూ ముందుకురాకపోవడంతో .. ఖర్చంతా తానే పెట్టుకున్నాడు. తాను ఉంటున్న ఇంటిని కూడా విక్రయించాడు. అలా వచ్చిన నగదుతో అతను జెండా తయారీని పూర్తిచేశాడు. ఇందుకోసం అతనికి దాదాపు నాలుగేళ్ల సమయం పట్టింది. జెండా తయారీ కోసం రూ. ఆరున్నర లక్షలు ఖర్చయిపోయింది. చివరికి జెండా తయారీ పూర్తయిపోంది. ఇప్పుడు తన జెండాను ఎర్రకోటపై ఎగరేయాలని కోరుతున్నారు. ఇందుకు తనకు భారత ప్రభుత్వం, అధికారులు సహకరించాలని వేడుకుంటున్నారు. తన దేశం పట్ల అమితామైన ప్రేమ ఉన్న ఓ కళాకారుడు నేసిన జెండాను ఎర్రకోటపై సగర్వంగా ఎగరేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం సంబంధిత అధికారులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి .. జెండా ఎగిరేసేందుకు సహకరించాలని సాటి భారతీయులు కోరుకుంటున్నారు.