క్లోరిన్కు బదులు సుద్ద కలిపారు- ఏలూరు ఘటనపై చంద్రబాబు- కక్కుర్తే కారణమని వెల్లడి
ఏలూరులో వింతవ్యాధితో వందలాది మంది ఆస్పత్రిపాలు కావడంపై విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. దాదాపు 400 మంది వ్యాధుల బారిన పడటానికి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన విమర్శించారు. ఏలూరులో నెలకొన్న పారిశుద్ధ్య పరిస్ధితుల వల్లే ప్రజలు వ్యాధి బారిన పడ్డారని ఆయన ఆరోపించారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్, ఆరోగ్యమంత్రులు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనతో పాటు పలు సందర్భాల్లోనూ విపక్షాలపై ఆరోపణలు చేసిన వైసీపీ సర్కారు ఏలూరు ఘటనకు బాధ్యతగా ఏం చేస్తారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఏలూరు ఘటనపై చంద్రబాబు
ఏలూరులో వందలాది మంది వింతవ్యాధి బారిన పడటం వెనుక వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ తీరు వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చంద్రబాబు తెలిపారు. ఏలూరులో ప్రభుత్వం ప్రజల ప్రాణాల్ని గాలికొదిలేసిందన్నారు.
ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా సీరియస్గా తీసుకోవాలన్నారు. పౌర సదుపాయాలను గాలికొదిలేయడం వల్లే ఏలూరులో ప్రజలు వింతవ్యాధి బారిన పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. ఏలూరులో ప్రజలు సరైన నీరు తాగకపోవడమో లేక నీరు కలుషితం కావడం వల్లో ఇలా అంతుచిక్కని వ్యాధి బారిన పడినట్లు చంద్రబాబు విశ్లేషించారు.
బ్లీచింగ్ పేరుతో సుద్ధ చల్లడం వల్లే...
ఏలూరులో తాగునీటిని పరిరక్షించడంలో ప్రభుత్వ వైపల్యం స్పష్టంగా కనిపిస్తోందని చంద్రబాబు తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదని, వారికి క్లోరిన్ సరఫరా కూడా చేయడం లేదని ఆయన ఆరోపించారు. అందుకే వారు పనికిరాని సుద్ధ తెచ్చి క్లోరిన్ పేరుతో నీటిలో కలిపేశారని, దీంతో వందలాది మంది ప్రజలు ఆస్పత్రి పాలయ్యారని చంద్రబాబు తెలిపారు. ఏలూరు ఘటనపై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. పారిశుద్ద్యం విషయంలో ప్రభుత్వానికీ, సీఎంకు అవగాహన లేదని, దీని ఫలితమే ఏలూరు ఘటన అని చంద్రబాబు పేర్కొన్నారు. క్లోరిన్కు బదులుగా సుద్ధ పొడి వాడకంపై ఇప్పటికే స్దానిక ప్రజలు ఆందోళన చేశారని, ప్రభుత్వ విజిలెన్స్ విచారణ ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు.
Recommended Video
పారిశుద్ధ్య లోపాలే అసలు కారణం..
ఏలూరు ఘటనకు పారిశుద్ధ్య లోపాలే కారణమని చంద్రబాబు ఆరోపించారు. అన్నీ బాగున్నాయి, మాస్ హిస్టీరియా అంటూ ఆరోగ్యమంత్రి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఏలూరులో ప్రజలకు సరఫరా చేసిన నీటిలో లోపం, నీటి కాలుష్యం వల్లే ఈ ఘటన జరిగిందని తాము భావిస్తున్నామన్నారు.
పారిశుద్ధ్య లోపాల వల్లే ఏలూరు ఘటన జరిగినందున ఈ దిశగా ప్రభుత్వం విచారణ జరిపించాలని చంద్రబాబు సూచించారు. ఇప్పటికైనా ఏలూరులో ఏం జరుగుతుందో ప్రభుత్వం తెలుసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీపై విమర్శలు చేయడం మాని రాష్ట్రంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ప్రభుత్వానికి సూచించారు.