వన్డే సిరీస్ ఓటమి చిచ్చు: టీమిండియా కేప్టెన్గా రోహిత్ శర్మ..కోచ్గా ధోనీ: కాంబినేషన్ అదుర్స్
సిడ్నీ: సుదీర్ఘ విరామం అనంతరం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న భారత క్రికెట్ జట్టు ఎదుర్కొన్న రెండు వరుస ఓటములు.. అభిమానుల్లో సెగ పుట్టించాయి. ఆస్ట్రేలియా గడ్డపై ఆ దేశ జట్టుతో ఇప్పటిదాకా టీమిండియా ఆడింది రెండంటే రెండు వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్లే. ఈ రెండు మ్యాచ్లు రగిలించిన కుంపటి మాత్రం ఈ పర్యటన మొత్తం కొనసాగేలా కనిపిస్తోంది. తొలి రెండు వన్డేల్లో ఆసీస్ బ్యాట్స్మెన్లు అరివీర భయంకరంగా చెలరేగిపోవడం.. బ్యాక్ అండ్ బ్యాక్ 400లకు దగ్గరగా స్కోరును బాది పారేయడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆ నిరాశ కాస్త ఆగ్రహజ్వాలగా మారింది.
Recommended Video
కోహ్లీ ఫెయిల్యూర్స్ వల్లే
భారత క్రికెట్ జట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ సరైన నిర్ణయాలను తీసుకోకపోవడం వల్లే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు చెలరేగిపోయారని మండిపడుతున్నారు ఫ్యాన్స్. అందుబాటులో ఉన్న బౌలింగ్ వనరులను వినియోగించుకోవడంలో కోహ్లీ దారుణంగా వైఫల్యం చెందాడని విమర్శిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఏ విధంగా విరాట్ కోహ్లీ పరాజయాలపాలు చేశాడో.. టీమిండియాను కూడా అదే బాట పట్టిస్తాడని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతని స్థానంలో రోహిత్ శర్మను కేప్టెన్ చేయాలనే డిమాండ్ను గట్టిగా వినిపిస్తున్నారు.. సోషల్ మీడియా ద్వారా.
రోహిత్ శర్మకు కేప్టెన్సీ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచులతో బెస్ట్ సక్సెస్ఫుల్ కేప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ జట్టును అయిదు సార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. ఒకవంక కేప్టెన్సీ భారాన్ని మోస్తూనే.. బ్యాటింగ్లో నిలకడగా రాణిస్తున్నాడు. టన్నుల కొద్దీ పరుగులను సాధిస్తున్నాడు. ఇదే అతనికి ప్లస్ పాయింట్ అవుతోంది. అదే విషయాన్ని ఫ్యాన్స్ ఎత్తిచూపుతున్నారు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు కేప్టెన్సీ పగ్గాలను అప్పగించాలనే డిమాండ్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ తన సహజ నైపుణ్యాన్ని, దూకుడును కోల్పోయాడని విమర్శిస్తున్నారు.
ఆర్సీబీ కేప్టెన్గా విఫలం..
రోహిత్ శర్మతో పోల్చుకుంటే విరాట్ కోహ్లీ ఐపీఎల్ ట్రాక్ రికార్డు ఏ మాత్రం బాగోలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేప్టెన్గా విరాట్ కోహ్లీ..ఒక్కసారి కూడా జట్టుకు ట్రోఫీని అందించలేకపోయాడు. ఫైనల్కు చేరిన సందర్భాలు కూడా నామమాత్రమే. బ్యాట్స్మెన్గా కూడా అతనిలో నిలకడ లోపించింది. అంతర్జాతీయ మ్యాచ్ల తరహాలో అతని ఆటతీరు ఉండట్లేదు. ఐపీఎల్ మ్యాచ్లల్లో విఫలమౌతున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఐపీఎల్-2020 సీజన్లోనూ అదే పరిస్థితి. టోర్నమెంట్ లీగ్ దశలో ఆర్సీబీ వరుస విజయాలను అందుకున్నప్పటికీ.. మ్యాచ్లు సాగుతున్న కొద్దీ డీలా పడింది. అతి కష్టం మీద ప్లేఆఫ్కు చేరుకుంది. అక్కడా బోల్తా కొట్టింది.
కోచ్ను కూడా మార్చాల్సిందే..
టీమిండియా కోచ్గా రవిశాస్త్రి సత్తా తగ్గిందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. అత్యుత్తమ బౌలింగ్ వనరులను కలిగి ఉన్న టీమిండియాను సరైన దిశలో నడిపించడంలో రవిశాస్త్రి విఫలం అయ్యాడని చెబుతున్నారు. తొలి వన్డేలో బౌలర్లు చేతులు ఎత్తేయడం వల్లే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు 374 పరుగుల భారీ స్కోరును చేయగలిగారని, అందులో నుంచి గుణపాఠాలను కోచ్ రవిశాస్త్రి నేర్చుకోలేకపోయాడని అంటున్నారు. రెండో వన్డేలో బౌలింగ్లో మార్పులు చేయకపోవడం వల్ల ఆసీస్.. మరింత అలవోకగా ఆడిందని, 389 పరుగుల రికార్డు స్కోరును సాధించిందని చెబుతున్నారు.
కోచ్గా ధోనీ బెటర్..
కోచ్గా రవిశాస్త్రిని తొలగించి, అతని స్థానంలో మహేంద్రసింగ్ ధోనీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ధోనీ చిత్తశుద్ధి ఏపాటిదో ప్రతి క్రికెట్ ప్రేమికుడికీ తెలుసునని, గాడితప్పిన జట్టును అతనొక్కడే పట్టాలెక్కించగలడని వివరిస్తున్నారు అభిమానులు. రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోనీ కాంబినేషన్ అద్భుతంగా పని చేస్తుందని అంచనా వేస్తున్నారు. విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిల్లో గెలుపుపై కాంక్ష తగ్గిందని. వారిద్దరినీ మార్చక తప్పదనీ అంటున్నారు.