బత్తిని సోదరుల చేప మందు ప్రసాదానికి తేదీ ఖరారు
హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తుల కోసం ఈ నెల 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్టు బత్తిని సోదరులు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బత్తిని సోదరులు మాట్లాడారు.
బత్తిని సోదరులైన హరినాధ్గౌడ్, సంతోష్గౌడ్, శివానందగౌడ్, గౌరీశంకర్గౌడ్లు మాట్లాడుతూ ప్రజారోగ్యమే ధ్యేయంగా నాలుగు తరాలుగా చేప ప్రసాద వితరణ జరుపుతూ వస్తున్నామన్నారు. 1845 నుంచి 170 సంవత్సరాలుగా తమ వంశీయులు ప్రసాదం పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
జూన్ 8వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పొందలేనివారు మూడు రోజుల పాటు దూద్బౌలిలోని తమ నివాసంలో తీసుకోవచ్చన్నారు. ప్రసాదం తీసుకోవడానికి 3 గంటల ముందు, తీసుకున్న గంట పాటు ఆహారం తీసుకోకూడదన్నారు.
వరుసగా నాలుగేండ్లపాటు చేప ప్రసాదం తీసుకుంటే ఉబ్బసం వ్యాధి తగ్గుముఖం పడుతుందన్నారు. ప్రసాదాన్ని సేవించిన వారు 45 రోజుల పాటు పథ్యం పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, కేటీ రామారావు అన్ని విధాలుగా సహకరిస్తున్నారంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.