సాధ్వీ నిరంజన్ జ్యోతి గొడవ: వెనకేసుకొచ్చిన బాబు
హైదరాబాద్: అన్ని విధాలుగా బిజెపి ప్రభుత్వానికి బాసటగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించికున్నట్లు అర్థమవుతోంది. ఇటీవలి కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వివాదంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు. సాధ్వి నిరంజన్ జ్యోతి క్షమాపణ చెప్పినందు వల్ల ఆ వివాదానికి తెర దించడం మంచిదని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు.
కొన్నిసార్లు కొందరు అనుకోకుండా ఏదో మాట్లాడుతారని, ఆ తర్వాత సరిదిద్దుకుంటారని, పార్లమెంటులో బహిరంగంగా ఆమె క్షమాపణ చెప్పారని ఆయన అన్నారు. దానిపై ఇంకా వివాదాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని అన్నారు. ఒక్కసారి క్షమాపణ చెప్పిన తర్వాత శిక్షించలేమని, ముందుకు సాగాలని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు వివాదాన్ని కొనసాగించడం రాజకీయ జిమ్మిక్కు అని వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షాల తీరు సరి కాదని ఆయన అన్నారు. మంత్రులు తాము మాట్లాడే విషయాలపై జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆమె జాగ్రత్తగా ఉండాల్సిందన, అదే సమయంలో బేషరతుగా ఆమె క్షమాపణ చెప్పారని, దాంతో వివాదం ముగిసిందని ఆయన అన్నారు.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో సాధ్వి నిరంజన్ జ్యోతి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభలను కూడా స్తంభింపజేస్తున్నాయి. ఆమె క్షమాపణతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందడం లేదు. మంత్రివర్గం నుంచి ఆమెను తొలగించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ప్రదాని నరేంద్ర మోడీ చెప్పినా ప్రతిపక్షాలు వినడం లేదు. దీంతో వివాదం పీటముడి పడింది.