IPL 2020: ధోనీ జట్టుకు అనుకూలంగా బీసీసీఐ ..?ఏ విషయమంటే.. అసంతృప్తితో ఫ్రాంచైజీలు..!
దుబాయ్ : కోవిడ్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ సారి యూఏఈలో జరుగుతోంది. అక్కడ కూడా అనేక ఆంక్షల మధ్య ఈ మెగా టోర్నీ నిర్వహిస్తున్నారు. క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఒక మెగా టోర్నీని ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తున్నారు. టోర్నీకి ముందు ఆటగాళ్లను క్వారంటైన్లో చాలా కాలం ఉంచారు. మైదానంలోకి అడుగుపెట్టకుముందు బయో సెక్యూర్ బబుల్లో ఉన్నారు. అంతేకాదు మొత్తం టోర్నీ ఈ బయో సెక్యూర్ బబుల్ పరిధిలోనే జరుగుతుండటం విశేషం. ఇక ఐపీఎల్ 2020 టోర్నీ నిర్వహించాలని డిసైడ్ అయిన నాటి నుంచి ఆయా జట్ల ఫ్రాంచైజీలను బీసీసీఐ హెచ్చరిస్తూ వచ్చింది. భారత్లోనే కాకుండా యూఏఈలో కూడా కోవిడ్ నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించరాదని ఫ్రాంఛైజీలకు స్పష్టం చేసింది బీసీసీఐ.
బీసీసీఐ ద్వంద్వ ప్రమాణాలు
కోవిడ్ నిబంధనలు పాటించాలని బీసీసీఐ గట్టిగా చెప్పడంలో తప్పులేదని కొన్ని ఫ్రాంచైజీలు చెబుతూనే... బీసీసీఐ ద్వంద్వ ప్రమాణాలు పాటించడంపై అసంతృప్తిని వ్యక్తం చేశాయి. క్వారంటైన్ సమయంలో బీసీసీఐ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని కొన్ని ఫ్రాంఛైజీలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. యూకే నుంచి ఐపీఎల్ 2020 సీజన్లో ఆడేందుకు వచ్చిన 21 మంది ఆటగాళ్లకు క్వారంటైన్ సమయాన్ని తక్కువ రోజులకే పరిమితం చేసిందని కొన్ని యాజమాన్యాలు ఆరోపించాయి.
36 గంటల పాటు క్వారంటైన్లో లేని కరన్, హాజిల్ వుడ్
తమ ఆటగాళ్లను, సిబ్బందిని కాపాడుకునేందుకు ఎంతో ఇన్వెస్ట్ చేశామని అయితే ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా సిరీస్ ముగించుకుని నేరుగా యూఏఈకి వచ్చిన ఆటగాళ్లకు మాత్రం క్వారంటైన్ సమయం తగ్గించడంపై అభ్యంతరం తెలిపాయి. 36 గంటల క్వారంటైన్ సమయం ముగించుకోకుండానే జోష్ హాజల్వుడ్ మరియు సామ్ కరన్లు అబుదాబికి బస్సులో బయలు దేరారని గుర్తుచేశాయి. ఆ రెండు గంటల్లో వారికి కరోనా లక్షణాలు కనుక వచ్చి ఉండి ఉంటే జట్టులో ఇతరులు ఇబ్బంది పడతారని ఫ్రాంఛైజీలు వాపోయాయి. వీరిద్దరూ చెన్నై జట్టులో ఉన్నారు.
మ్యాచ్కు నాలుగు గంటల ముందు చెన్నై జట్టుతో..
ఇదిలా ఉంటే జోష్ హాజిల్వుడ్ మరియు సాం కరన్లు క్వారంటైన్లో లేరని సమాచారం. వారు జట్టు సభ్యులతో చేరారంటే బీసీసీఐ వీరికి అనుకూలంగా వ్యవహరించిందని ద్వంద్వ ప్రమాణాలు పాటించినట్లు స్పష్టంగా తెలుస్తోందని ఫ్రాంఛైజీలు వాపోతున్నాయి. సాధారణంగా స్థానిక కాలమానం ప్రకారం 36 గంటలు క్వారంటైన్లో ఉండాలని నిబంధనలు సూచిస్తుండగా.. ఆట మరో నాలుగు గంటల్లో ప్రారంభం అవుతుందనగా ఈ జోష్ హాజిల్ వుడ్ మరియు సాం కరన్లు ఇద్దరూ జట్టులో వచ్చి చేరారని చెబుతున్నారు. ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు 36 గంటల క్వారంటైన్ సమయం పడుతుంది. అన్ని నిబంధనలు కఠినంగా పాటించాలని చెబుతున్న బీసీసీఐ ఈ ఇద్దరి ఆటగాళ్ల విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం వహించిందని ప్రశ్నిస్తున్నాయి ఫ్రాంఛైజీలు.