కోడెల ఆత్మహత్య కేసులో ఇప్పటివరకు 12మంది విచారణ .. ఫోన్ కాల్స్ డేటా పరిశీలన
కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలపై అనుమానం ఉన్న వారందరినీ విచారిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 12 మందిని విచారించామని ఏసీపీ కెఎస్ రావు తెలిపారు. ఇక అంతే కాకుండా కోడెల కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశామని పేర్కొన్నారు. కోడెల ఫోన్లో కాల్ డేటాపై ఆరా తీస్తున్నామని, సీడీఆర్ఏ కాల్ లిస్ట్ రిపోర్ట్ను పరిశీలిస్తున్నామని చెప్పారు బంజారా హిల్స్ ఏ సి పి.
వైసీపీలో చేరినా.. తోటత్రిమూర్తులు నాకు శత్రువే: ఏపీ డిప్యూటీ సీఎం.. పార్టీలో దుమారం
మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు తో ఆత్మహత్య అని తేలడంతో ఆత్మహత్యకు గల కారణాలను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక ఈ కేసు విషయంలో సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని, కాల్ డేటాపై వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్న పోలీసులు త్వరలోనే ఈ కేసులో పురోగతి సాధిస్తామని చెప్తున్నారు. ఆత్మహత్య చేసుకునే సమయంలో కోడెల శివప్రసాద్ మొదటి తన పంచెను ఉరి వేసుకోవడానికి ఉపయోగించాలని భావించినప్పటికీ, అది వీలు కాకపోవడంతో నైలాన్ తాడు ను ఉపయోగించి నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఇక అంతే కాదు గతంలో కూడా ఆయన పలుమార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే కాల్ డేటా ను పరిశీలించిన పోలీసులకు ఆయన ఆత్మహత్యకు పాల్పడిన రోజున బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి లోని వైద్యురాలి తో ఇరవై నిమిషాలపాటు మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు.ఇక ఆమెను సైతం పోలీసులు విచారించనున్నారు. ఆమెతో ఆయన ఏం మాట్లాడారో తెలుసుకునే పనిలో పడ్డారు.