షాకింగ్ : ఏపీలో ఒకే కార్యాలయంలో 33 మందికి కరోనా పాజిటివ్...
గుంటూరులోని అమరావతి రోడ్లో ఉన్న మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యాలయంలో 33 మందికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయింది. ఒకే కార్యాలయంలో ఇంతమందికి కరోనా సోకడం సిబ్బంది మొత్తాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. మొదట కార్యాలయంలో పనిచేసే రాష్ట్ర డైరెక్టర్కు కరోనా పాజిటివ్గా తేలడంతో... ముందు జాగ్రత్తలో భాగంగా 120 మంది సిబ్బందికి కూడా టెస్టులు చేశారు. టెస్టుల్లో 33 మందికి పాజిటివ్గా తేలడంతో కార్యాలయాన్ని మూసివేశారు.
రష్యాను దాటేసిన భారత్... కరోనా కేసుల్లో వరల్డ్ టాప్-3...
ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ కార్యాలయ ఉద్యోగులందరికీ ఫోన్లు చేసిన అధికారులు.. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకూ కార్యాలయానికి ఎవరూ రావద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కార్యాలయాన్ని శానిటైజ్ చేసే పనిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. కేసుల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ కార్యకలాపాల్లో 50శాతం ఉద్యోగులతోనే పని చేయించేలా గుంటూరు కలెక్టర్ ఇప్పటికే మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
లాక్ డౌన్ సడలింపుల తర్వాత గుంటూరులో కేసుల సంఖ్య పెరిగింది. ఇటీవల కలెక్టర్ కార్యాలయం సమావేశానికి వచ్చిన ఓ ప్రజాప్రతినిధికి పాజిటివ్ వచ్చిందని సమాచారం రావడంతో... అక్కడి నుంచి అధికారులంతా బయటకు పరుగులు తీశారు. అనంతరం ఆ హాల్ను శానిటైజ్ చేశారు. కరోనా సోకిన ప్రజాప్రతినిధితో సన్నిహితంగా ఉన్న నేతలు, అధికారులు ముందస్తు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.
ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,697కి చేరగా.. ఇందులో కర్నూలు,అనంతపురంగుంటూరు,కృష్ణా జిల్లాల్లోనే అత్యధిక కేసులున్నాయి. గుంటూరులో ఇప్పటివరకూ 1827 కరోనా కేసులు నమోదవగా 19 మంది మృతి చెందారు.