గుంటూరులో కరోనా రోగి ఆత్మహత్యాయత్నం... ఆస్పత్రి భవనం పైనుంచి దూకిన పేషెంట్...
గుంటూరు జిల్లాలో ఓ కరోనా పేషెంట్ ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర గాయాలవడంతో ప్రస్తుతం విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే... గుంటూరు మారుతీనగర్కు చెందిన ఓ వృద్దుడికి కొద్ది రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో మంగళగిరి మండలం చినకాకానిలోని ఎన్నారై ఆస్పత్రిలో చేరాడు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం(అగస్టు 14) ఉదయం ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు.
వృద్దుడి ఆత్మహత్యయత్నాన్ని గమనించిన సిబ్బంది అతన్ని ఎమర్జెన్సీ వార్డుకు చేర్చి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలవడంతో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే వృద్దుడు ఎందుకు ఆత్మహత్యకు యత్నించాడన్నది తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవల ఒంగోలులోని జీజీహెచ్ ఆస్పత్రిలోనూ రాధాకృష్ణా రెడ్డి అనే ఓ వ్యక్తి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లోనూ బుధవారం(అగస్టు 12)న 65 ఏళ్ల ఓ వృద్దుడు ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Recommended Video
ఇటీవల హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలోనూ నాగేంద్ర అనే ఓ కరోనా పేషెంట్ ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఆంధ్రప్రదేశ్,తెలంగాణలోనే కాదు ఢిల్లీ,హైదరాబాద్,బెంగళూరు సహా పలు నగరాల్లో ఈ తరహా ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. కరోనా పేషెంట్లలో నెలకొన్న అపోహల కారణంగానే ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా నుంచి కోలుకున్నా కుటుంబ సభ్యుల నుంచి వివక్ష ఎదురవడం... ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు నిరాకరిస్తుండటం కారణంగానూ కొన్ని ఆత్మహత్య ఘటనలు చోటు చేసుకున్నాయి.