ఆరేళ్ళ చిన్నారిపై 50ఏళ్ళ వ్యక్తి దారుణం ... భుజాలపై ఎత్తుకెళ్ళి కామంతో కాటేసిన అమానుషం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై దాడులు జరగకుండా కఠినమైన చట్టాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం దిశా చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లోకి తీసుకువచ్చింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభం శుభం తెలియని చిన్నారులపై, మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కామాంధులు నిత్యం పసి మొగ్గల బ్రతుకులను చిద్రం చేస్తూనే ఉన్నారు.
ఏడాదిగా అత్యాచారం..మరణానికి ముందు బాలిక వాంగ్మూలం..ఆ అనాధాశ్రమం సీజ్
గుంటూరు జిల్లాలో ఘటన ..ఆడుకుంటున్న చిన్నారిని భుజాలపై ఎత్తుకెళ్ళి మరీ
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో అభం శుభం తెలియని ఒక ఆరేళ్ళ చిన్నారిపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణంలో బయట ఆడుకుంటున్న పాపను, భుజాలపై ఎక్కించుకుని తీసుకు వెళ్లిన వ్యక్తి ఆపై బాలికపై అమానుషంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. పేరేచర్ల శివ పార్వతి కాలనీకి చెందిన ఆరేళ్ళ చిన్నారి, తమ బంధువైన మరో బాలుడితో కలిసి పేరేచర్ల కూడలి వద్ద ఆడుకుంటోంది. అయితే కొంత సేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో బాలుడు, బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. కంగారు పడ్డ తల్లిదండ్రులు మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులకు ఫిర్యాదు .. సీసీ టీవీ ఫుటేజ్ లో చిన్నారిని తీసుకెళ్ళిన దృశ్యాలు
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చిన్నారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు చిన్నారి ఆడుకున్న కూడలిలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. సీసీ కెమెరాల్లో చిన్నారి ఒక 50 ఏళ్ల వయసున్న వ్యక్తి తన భుజాలపై ఎక్కించుకొని తీసుకువెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు . సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతను నల్లపాడు కు చెందిన స్వామిగా గుర్తించిన పోలీసులు, పేరేచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో చిన్నారి కోసం గాలింపు చేపట్టారు.
Recommended Video
రైల్వే స్టేషన్ సమీపంలో చిన్నారి .. నిందితుడిపై పోక్సో చట్టం క్రింద కేసు
అర్ధరాత్రి సమయంలో చిన్నారిని గుర్తించగా ఆమెపై లైంగిక దాడి జరిగిందని గుర్తించిన పోలీసులు, వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు స్వామి అరెస్ట్ చేసి, తమదైన శైలిలో విచారణ చేయగా చిన్నారిపై రైల్వేస్టేషన్ సమీపంలో లైంగిక దాడి చేసినట్లుగా నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దిశ, నిర్భయ, పోక్సో వంటి ఎన్ని చట్టాలున్నా మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. నిత్యం అన్నెం పున్నెం తెలియని చిన్నారులపై అకృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు.