ఘోరం: ప్రేమించానని వెంటపడి, పెళ్లి చేసుకోమంటే చంపి, ముక్కలుగా నరికేశాడు
గుంటూరు: ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రేమించిన యువతినే అనుమానంతో దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేసి నేరం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితుడ్ని కటకటాల వెనక్కినెట్టారు.
ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు..
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతగుంటూరుకు చెందిన ఓ యువతి 2009లో పాలిటెక్నిక్ చదువుతున్న సమయంలో అదే కళాశాలలో చదువుతున్న అలీనగర్కు చెందిన షేక్ కరీం అలియాస్ నాగూర్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమె కూడా చివరకు అతడ్ని నమ్మింది. కాగా, గుంటూరు నగరంలోని ఓ ద్విచక్ర వాహనాల షోరూంలో ఆ యువతి చేస్తోంది. ఈ క్రమంలో రఫీ అనే యువకుడితో సదరు యువతి సన్నిహితంగా ఉంటున్నట్లు కరీం అనుమానించి ఉద్యోగం మాన్పించాడు.
పెళ్లి చేసుకోమంటే కొట్టి చంపాడు..
2018, మే 25న కాలేజీలో చదివిన స్నేహితురాలి వివాహం ఉందని యువతి కుటుంబసభ్యులకు చెప్పి, ఆమెను పాతగుంటూరులో అద్దెకు తీసుకున్న ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆమె తనను త్వరగా చేసుకోవాలని కరీంను ఒత్తిడి చేసింది. అయితే, నువ్వు ఎంతమందితో సన్నిహితంగా ఉంటున్నావు, నిన్ను పెళ్లి చేసుకోనని ఆమెకు కరీం తేల్చిచెప్పాడు. తాను పోలీసు కేసు పెడతానంటూ ఆమె బెదిరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కరీం.. ఆ యువతిని గోడకేసి బలంగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహకోల్పోయి కిందపడింది. ఆ తర్వాత ఆమెను గొంతునులిమి హతమార్చాడు కరీం.
ఘోరం.. యువతిని ముక్కలుగా నరికి..
అంతేగకా, గోడలను కోసే యంత్రంతో ఆ యువతి శరీరాన్ని ముక్కలు ముక్కులుగా చేసి, మూటకట్టాడు. ఆ రోజు చీకపడిన తర్వాత సుద్దపల్లిడొంక సమీపంలోని విజయశాంతినగర్లోని నిర్మానుష్య ప్రాంతంలో తీసుకెళ్లి పడేశాడు. రెండ్రోజుల తర్వాత మళ్లీ అక్కడికివెళ్లి ఆ మూటను పెట్రోల్ పోసినిప్పటించాడు. సదరు యువతి గురించి ప్రశ్నించినవారికి, ఎవరినో ప్రేమించి అతనితో వెళ్లిపోయిందని నమ్మించాడు.
ఎన్ని ప్లాన్లు వేసినా.. కిరాతకుడిని కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు.. యువతిని దారుణంగా చంపి, కేసును తప్పుదోవపట్టించేలా వ్యవహరించిన కరీంను అరెస్ట్ చేశారు. యువతిని హత్య చేసిన తర్వాత రక్తపు మరకలు, ఇతర ఆధారాలు లభించకుండా ప్రత్యేకమైన కెమికల్తో శుభ్రం చేశాడని పోలీసులు తెలిపారు. కెమికల్ ఇంజినీరింగ్ చేసిన కరీం నేరం నుంచి బయటపడేందుకు పెద్ద ప్రణాళికే వేశాడని గుర్తించినట్లు వెల్లడించారు. కిరాతకుడిని కఠినంగా శిక్షించాలని బాధిత యువతి కుటుంబసభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.