ఎన్జీ రంగా వర్సిటీ వీసీ అరెస్టు: ఎస్సీ.. ఎస్టీ కేసులో చర్య: గవర్నర్ అనుమతి లేకుండానే..!
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ వల్లభనేని దామోదర్ నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో విచారణ అనంతరం ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే కారణంతోనే మురళీకృష్ణతోపాటు అతడి భార్య విజయదుర్గను, తదితరులను కూడా ఉద్యోగం నుంచి తొలగించినట్టు ఫిర్యాదు దారుడు ఆరోపిస్తున్నారు. ఇదే విషయం మీద మాట్లాడటానికి వెళ్లిన తనను కులం పేరుతో దూషించటంతో కేసు నమోదు చేసారు. దీని పైన విచారణ తరువాత పోలీసులు వీసీని అరెస్ట్ చేసారు. కోర్టులో హాజరుపరచగా కోర్టు ఈ నెల 30 వరకు రిమాండ్ విధించింది. దీంతో దామోదర్నాయుడిని జైలుకు తరలించారు. అయితే, గవర్నర్ అనుమతి లేకుండా వీసీని ఎలా అరెస్ట్ చేస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఎస్సీ..ఎస్టీ కేసులో పోలీసుల చర్య
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్ వల్లభనేని దామోదరనాయుడి పైన నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో విచారణ అనంతరం పోలీసులు అరెస్ట్ చేసారు. చిలకలూరిపేటకు చెందిన ఉయ్యాల మురళీకృష్ణ లాంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి. వీసీ వద్ద అటెండర్గా పని చేసేవారు. విధులకు సరిగా రాకపోవడంతో ఆరు నెలల క్రితం విధుల నుంచి తప్పించారు. అప్పటి నుంచి మురళీకృష్ణ తనను ఉద్యోగంలోకి తీసుకోవాలని వీసీ చుట్టూ తిరుగుతున్నారు. దీనిలో భాగంగా గత నెల 23న దామోదరనాయుడు సచివాలయానికి వస్తున్నారని తెలుసుకుని అక్కడ ఆయన్ను కలిశారు. తనను ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరారు. అయితే దామోదరనాయుడు సచివాలయంలో తన పట్ల అమర్యాదకరంగా మాట్లాడారని.. ఎక్కడకుపడితే అక్కడకు వచ్చి అడగడమేనా అంటూ కులం పేరుతో తనను దూషించారని మురళీకృష్ణ గతనెల 23న తుళ్లూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వైసీపీ సానుభూతి పరుడిని కారణంగానే..
కేవలం వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే కారణంతోనే మురళీకృష్ణతోపాటు అతడి భార్య విజయదుర్గను, తదితరులను కూడా ఉద్యోగం నుంచి తొలగించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైందని చెబుతున్నారు. గత ఐదేళ్లూ టీడీపీపై ప్రేమతో ఓ సామాజికవర్గానికి చెందినవారినే వీసీ దామోదర్ నాయుడు ప్రోత్సహించారనే విమర్శలున్నాయి. ఇతర సామాజికవర్గాలవారు తన చాంబర్ దరిదాపుల్లోకి కూడా రావడానికి వీల్లేదని బాహాటంగానే ప్రకటించారని ఉద్యోగులు చెబుతున్నారు. వీసీ చర్యలతో అకారణంగా నష్టపోయిన ఉద్యోగులు గవర్నర్, సీఎంకు ఫిర్యాదులు చేశారు. ప్రజాప్రతినిధులు, వర్సిటీ అధికారులకు కూడా 400 ఫిర్యాదులు అందాయి. వీసీపై అందిన ఫిర్యాదులను విచారించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతంలో మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్నను నియమించింది. కులం పేరుతో మురళీకృష్ణను వీసీ దూషించడం వాస్తవమేనని నిర్ధారించి వీసీ దామోదరనాయుడిని అరెస్టు చేశారు. అక్కడి నుంచి తుళ్లూరు పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం మంగళగిరి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఈ నెల 30 వరకు రిమాండ్ విధించింది. దీంతో దామోదర్నాయుడిని జైలుకు తరలించారు.
గవర్నర్ అనుమతి లేకుండానే..!
వీసీ దామోదరనాయుడు అరెస్టు వర్సిటీ వర్గాల్లో విస్మయం కలిగించింది. అరెస్టు చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని భావిస్తున్నాయి. వర్సిటీ పాలనను గాడిలో పెట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్న దామోదరనాయుడు ముక్కుసూటిగా వ్యవహరించే క్రమంలో ఆయన విమర్శలకు గురయ్యారు. కొందరు ఉద్యోగులు దీర్ఘకాలంగా ఒకే చోట ఉండడం, మరికొందరు నిధుల దుర్వినియోగానికి పాల్పడడం వంటి కారణాలతో వీసీ సదరు ఉద్యోగులను బదిలీ చేయడం, జరిమానాలు విధించడంతో ఆయనపై వ్యతిరేకత వచ్చింది. ఇదే సమయంలో వీసీ పదవి రాజీనామా చేయనందుకే ఎన్జీ రంగా వర్సిటీ వీసీ దామోదర నాయుడుపై అక్రమ కేసులు పెట్టారని టీడీపీ నేత జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ అనుమతి లేకుండా వీసీని ఎలా అరెస్ట్ చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు. అధ్యాపకులను కూడా వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు.