జయప్రకాశ్ రెడ్డి అత్యక్రియలు పూర్తి - కరోనాతోనే తండ్రికి తలకొరివి - ప్రధాని మోదీ సంతాపం
ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) అంత్యక్రియలు పూర్తయ్యాయి. గుండెపోటుతో మంగళవారం ఉదయం కన్నుమూసిన ఆయనకు కుటుంబీకులు ఇవాళ సాయంత్రమే తుదివీడ్కోలు పలికారు. గుంటూరులోని కొరిటపాడు శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అతికొద్ది మంది సమక్షంలోనే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. అంతకుముందు,
జయప్రకాశ్ రెడ్డి అంత్యక్రియల నిర్వహణపై ఒకింత సందిగ్ధత ఏర్పడింది. జేపీ కొడుకు చంద్రప్రకాశ్ రెడ్డి, కొడలు కొద్ది రోజుల కిందటే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో తండ్రి అంత్యక్రియలకు కొడుకు వచ్చే వీలుంటుందా, లేదా అనే కన్ఫ్యూజన్ తలెత్తింది. చివరికి వైద్యుల అనుమతితో సకల జాగ్రత్తలు పాటిస్తూ, నిండుగా పీపీఈ కిట్ ధరించి చంద్రప్రకాశ్ రెడ్డి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం తిరిగి ఆస్పత్రికి వెళ్లిపోయారు.
లాక్ డౌన్ లో సినిమా షూటింగ్స్ నిలిచిపోయిన దరిమిలా జయప్రకాశ్ రెడ్డి గుంటూరు విద్యానగర్ లోని ఇంట్లోనే ఉంటున్నారు. మంగళవారం ఉదయం బాత్రూమ్ లో ఉండగా సడెన్ గా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. జేపీ స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల. సినిమాల్లోకి రాకముందు ఆయన పోలీస్ శాఖలో పనిచేశారు. నాటకరంగంలోనూ విశేష అనుభవముంది.
నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన తన అధికార ట్విటర్ లో తెలుగులో సందేశాన్ని రాశారు. ''జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు . తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి" అని మోదీ రాశారు. ప్రధానితోపాటు ఉపరాష్ట్రపతి, పలువురు కేంద్రమంత్రులు, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ ప్రముఖులూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.