కృష్ణమ్మ పరవళ్లు: నిండుకుండలా నాగార్జున సాగర్: గేట్లు ఎత్తివేత: సముద్రం వైపు
గుంటూరు: ఎగువ ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరద జలాలతో పోటెత్తుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీల్లో కృష్ణానదిపై నిర్మించిన ఆనకట్టలన్నీ నిండుకుండల్లా మారిపోయాయి. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. వరద జలాలన్నీ నాగార్జున సాగర్కు చేరుకున్నాయి. శుక్రవారం నాటికి నాగార్జున సాగర్లో వరద జలాలు గరిష్ఠస్థాయి నీటి మట్టాన్ని అందుకున్నాయి. దీనితో ఈ ఉదయం 11 గంటలకు నాలుగు గేట్లను ఎత్తివేశారు అధికారులు. నీటిని దిగువకు వదిలి వేస్తున్నారు.
మరోవంక- శ్రీశైలం రిజర్వాయర్కు వరద ఉధృతి తగ్గలేదు. మరింత పెరుగుతోంది. ఫలితంగా మొదట మూడు గేట్లను ఎత్తిన జల వనరుల శాఖ అధికారులు.. ఆ సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ వెళ్లారు. బుధవారం సాయంత్రం మూడుగేట్లను ఎత్తి, వరద జలాలను దిగువకు విడుదల చేశారు. గురువారం మధ్యాహ్నానికి అయిదు గేట్లను, సాయంత్రానికి 10 గేట్లను ఎత్తారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 4,18,970 క్యూసెక్కుల మేర వరద జలాలు శ్రీశైలం రిజర్వాయర్కు చేరుకుంటుండగా.. దాదాపు అదే పరిమాణంలో అంటే- 4,59,254 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి వేస్తున్నారు.
ఫలితంగా వరద నాగార్జున సాగర్కు వరద జలాలు పోటెత్తాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం : 587.80 అడుగులుగా నమోదైంది. ఇన్ ఫ్లో నాలుగు లక్షల క్యూసెక్కులపైగా ఇన్ఫ్లో నమోదవుతోంది. దీనితో నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పరిసరాలతో పాటు పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరూ గుమికూడి ఉండకూండా నిషేధాజ్ఙలను జారీ చేశారు. 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. దీనిపై ఇదివరకే పరీవాహక ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రచారాన్ని చేపట్టారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కృష్ణమ్మ పరవళ్లు: నిండుకుండలా నాగార్జున సాగర్: గేట్లు ఎత్తివేత: సముద్రం వైపు#NagarjunaSagar #Srisailam pic.twitter.com/QOgDtVvUZm
— oneindiatelugu (@oneindiatelugu) August 21, 2020
ప్రస్తుతానికి నాలుగు గేట్లను ఎత్తినప్పటికీ.. క్రమంగా ఆ సంఖ్యను పెంచుకుంటూ పోయే అవకాశాలు ఉన్నాయి. వరదనీరు వచ్చి చేరుతున్న కొద్దీ అవుట్ ఫ్లోను పెంచుతామని జల వనరుల శాఖ అధికారులు వెల్లడించారు. గేట్లను ఎత్తివేసిన తరువాత.. ప్రాజెక్టును సందర్శించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున స్థానికులు తరలి వస్తుంటారని, ఈ సారి ఆ అవకాశం ఇవ్వట్లేదని అధికారులు స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సందర్శకులెవరూ ప్రాజెక్టు వద్దకు రావొద్దని అన్నారు. ఎవరైనా వచ్చినా.. వెనక్కి పంపిస్తామని చెప్పారు.