మంగళగిరిలో పవన్ కళ్యాణ్ భూమి కొనుగోలు చేశారా..? వైసీపీ నేతలు చెబుతున్నదేమిటి..?
అమరావతి: ఏపీలో రాజధాని భూముల చుట్టూ పెద్ద రచ్చ నడుస్తోంది. ఇప్పటికే రాజధాని భూముల కొనుగోలు వ్యవహారంలో జరిగిన అవకతవకలపై సీఐడీ విచారణను వేగవంతం చేయగా... తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భూముల కొనుగోలు అంశం కూడా తెరపైకి వచ్చింది. గత కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని రైతులకు మద్దతుగా నిలిచారు. అయితే ఢిల్లీలో బీజేపీ నేతలను కలిసిన తర్వాత ఆయన స్వరం మార్చారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమంటూ ఢిల్లీలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ జనసేన పార్టీలు కలిసి చర్చించి ఒక ప్రకటన చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ కూడా భూములు కొనుగోలు చేశారని అధికార వైసీపీ పార్టీ సర్వే నెంబర్లతో సహా చెబుతోంది.
రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు భూమి కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్
ఏపీలోని మంగళగిరి- గుంటూరు జిల్లా మధ్య రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భూమి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ భూమిని 2018లో ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫడవిట్లో మంగళగిరి మండలంలోని కాజా గ్రామంలో సర్వే నెంబర్ -368/B1 వద్ద పవన్ కళ్యాణ్ రూ.120 కోట్లు విలువ చేసే భూమిని కొన్నట్లు పొందుపర్చారు. ఆ తర్వాత రెండు నెలలకు మంగళగిరిలోని మరోచోట అంటే సర్వే నెంబర్ 57/1లో రూ.2.66 కోట్లు విలువ చేసే భూములను కొన్నారు.
తెల్లరేషన్ కార్డులున్న వారే భూమిని కొనుగోలు చేశారు: సీఐడీ
భూముల వ్యవహారంపై ఏపీ సీఐడీ చేస్తున్న విచారణ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భూముల కొనుగోలు వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. ఒక్క మంగళగిరిలోనే 148 మంది 133.85 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సీఐడీ చెబుతోంది. దీని విలువ 80.53 కోట్లుగా ఉంటుందని సీఐడీ వెల్లడించింది. ఇలా భూములు కొనుగోలు చేసిన వారిలో 93 మందికి పాన్ కార్డు లేదని సమాచారం. ఇక భూములు కొనుగోలు చేసిన వారిలో అధికంగా తెల్లరేషన్ కార్డులు కలిగి ఉన్నవారే ఉన్నారని వారికి పాన్ నెంబర్ కూడా లేదని సీఐడీ విచారణలో వెలుగు చూసింది. ఇక పన్ను ఎగొట్టేందుకు మొత్తం లావాదేవీలు నగదు రూపంలోనే జరిపినట్లు సీఐడీ పేర్కొంది.
ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులపై కేసు నమోదు చేసిన సీఐడీ
ఇక అమరావతి రాజధాని ప్రాంతంలో తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న 131 మంది 129.8 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సీఐడీ గుర్తించగా... ఇందులో 90 మందికి పాన్ కార్డు లేదని వెల్లడించింది. తుళ్లూరు మండలంలో 242.94 ఎకరాలు భూమిని 238 మంది కొనగా అందులో 86 మందికి పాన్ కార్డులు లేవని సీఐడీ గుర్తించింది. ఇదే తరహా కొనుగోళ్లు పెదకాకాని, తాడికొండ, మంగళగిరి , తాడేపల్లిలో జరిగినట్లు సీఐడీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఇక భూమి కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొంటూ సీఐడీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసు నమోదు చేసింది.