Guntur: అతివేగం.. ఆరుమంది ప్రాణాలను హరించింది..
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జిల్లాలోని ఫిరంగిపురం మండలం రేపూడి సమీపంలో సోమవారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులందరూ ఫిరంగిపురం మండలానికి చెందిన వారిగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఫిరంగిపురం మండలానికి చెందిన ఓ కుటుంబం నరసరావు పేటలో ఓ శుభ కార్యానికి హాజరయ్యారు. ఈ ఉదయం వారు ఆటోలో తమ స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో ఆటో రేపూడి సమీపానికి వచ్చిన వెంటనే.. నరసరావు పేట వైపు వెళ్తోన్న టాటా ఏస్ మినీ అదుపు అతి వేగంతో ఎదురుగా వస్తోన్న ఆటోను ఢీ కొట్టింది. ఫలితంగా- ఆటోలో ప్రయాణిస్తోన్న వారిలో ఆరుమంది మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడ్డ వారిని నరసరావు పేట ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా- అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. టాటా ఏస్ ఢీ కొట్టిన వెంటనే ఆటో గాల్లోకి ఎగిరింది. నుజ్జునుజ్జు అయింది.
టాటా ఏస్ సైతం రోడ్డు పక్కన బోల్తా పడింది. టాటా ఏస్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం తరలించారు. గాయపడ్డ వారిని నరసరావు పేట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.