గుంటూరు ట్యూషన్ టీచర్ నిర్లక్ష్యం: కరోనా కోరల్లో 14 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
గుంటూరు: ఓ ట్యూషన్ టీచర్ నిర్వాకం ఓ గ్రామంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైంది. ట్యూషన్ చెప్పే సమయంలో ముందు జాగ్రత్త చర్యలను తీసుకోకపోవడం, కరోనా వైరస్ పట్ల అజాగ్రత్తగా ఉండటం వల్ల 14 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. వారంతా గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆ విద్యార్థులందరూ ఏడేళ్ల లోపు వయస్సు ఉన్న వారే కావడం పట్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులు ఆ గ్రామంలో ప్రత్యేకంగా మాస్ టెస్టింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు.
జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని భట్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. భట్లూరులో ఓ ఉపాధ్యాయుడు చాలాకాలం నుంచి ట్యూషన్లను నిర్వహిస్తున్నారు. పాఠశాలలు మూత పడటం, ఆన్లైన్ సౌకర్యం అంతంత మాత్రమే కావడం వల్ల పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయన వద్దకు ట్యూషన్కు పంపిస్తున్నారు. రెండు రోజుల కిందట అనారోగ్యానికి గురైన ఆ ఉపాధ్యాయుడిని పరీక్షించగా కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. ఆయన ట్యూషన్ను నిర్వహిస్తున్నారనే విషయం తెలుసుకున్న అధికారులు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పరీక్షలు నిర్వహించారు.
వారిలో 14 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కరోనా సోకినట్లు తేలింది. ప్రస్తుతం భట్లూరులో 39 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అప్రమత్తమైన అధికారులు వారిని గుంటూరులోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి క్వారైంటన్ కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులందరూ ఏడేళ్ల లోపు వయస్సు ఉన్న వారే కావడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన తరువాత భట్లూరులో కరోనా వైరస్ మాస్ టెస్టింగులను నిర్వహిస్తుననామని చెప్పారు.
Recommended Video
ఇదిలావుండగా..వైద్యాధికారులు గురువారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గుంటూరు జిల్లాలో 55,284 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 49,143 మంది డిశ్చార్జి అయ్యారు. 534 మంది మరణించారు. జిల్లాలో ఉన్న మొత్తం యాక్టివ్ కేసులు 5,607గా నమోదు అయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక కరోనా మరణాలు నమోదై జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 662 మంది కరోనా కాటు వల్ల మృత్యువాత పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా మూడో స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 528 మంది చనిపోయారు.