నిమ్మగడ్డ నోటిఫికేషన్పై యువ ఓటర్లు భగ్గు: 3.6 లక్షలమందికి పైగా: హైకోర్టులో ధూలిపాళ్ల పిటీషన్
అమరావతి: రాష్ట్రంలో వచ్చేనెల 5వ తేదీ నుంచి నాలుగు దశల్లో నిర్వహించ తలపెట్టిన పంచాయతీ ఎన్నికల వ్యవహారం.. అనూహ్య మలుపు తిరిగింది. ఈ వివాదంలోకి యువతరం ప్రవేశించినట్లు కనిపిస్తోంది. ఎన్నికలను నిర్వహించడానికి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్.. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వేళ.. మరో పిటీషన్ దాఖలైంది. గుంటూరు జిల్లాకు చెందిన ధూలిపాళ్ల అఖిల అనే ఓ విద్యార్థిని ఈ పిటీషన్ను దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
మూడున్నర లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు..
రాష్ట్రంలో సవరించిన జాబితా ప్రకారం.. పంచాయతీ ఎన్నికలను నిర్వహించట్లేదంటూ శనివారం నాటి విలేకరుల సమావేశంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ప్రకటన ఆధారంగా ఆ విద్యార్థిని.. ఈ హౌస్ మోషన్ పిటీషన్ను దాఖలు చేసినట్లు చెబుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ప్రకటనలను చూస్తే.. రాష్ట్రంలో మూడున్నర లక్షలమందికి పైగా కొత్త ఓటర్లు.. ప్రత్యేకించి యువత తమ ఓటుహక్కును కోల్పోతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కొత్త జాబితా ప్రకారం..
కొత్త జాబితా ప్రకారం పంచాయతీ ఎన్నికలను నిర్వహించేలా ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని ఆదేశించాలని ధూలిపాళ్ల అఖిల హైకోర్టుకు విజ్ఙప్తి చేశారని అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వేలాదిమంది యువతీ, యువకులు ఆసక్తిగా ఉన్నారని, అలాంటి వారి పేర్లను కనీసం ఓటర్ల జాబితాలో లేకుండా చేయడం సరికాదని తాను అభిప్రాయపడుతున్నాననే విషయాన్ని పిటీషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఓటు హక్కు ఉన్నప్పటికీ.. దాన్ని సవరించిన జాబితా ప్రకారం కాకుండా.. 2019 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం వల్ల లక్షలాది మంది యువ ఓటర్లు ఓటు వేసే హక్కును కోల్పోతారని అన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం..
కొత్త ఓటర్లు, యువతకు ఓటు వేసే అవకాశాన్ని రాజ్యాంగమే కల్పించిందని గుర్తు చేసినట్లు సమాచారం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం.. 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు వేసే హక్కు ఉందని, మూడున్నర లక్షలమందికి పైగా యువ ఓటర్లు ఉన్నప్పటికీ.. వారికి ఆ అవకాశాన్ని కల్పించకుండా.. పాత జాబితా ప్రకారమే ఎన్నికలను నిర్వహిస్తున్నామంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలని, ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ ధూలిపాళ్ల అఖిల విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు.