హోదాపై ప్రకటన.. చంద్రబాబుకు జగన్ పంచ్లు: గుట్టు రట్టు చేసిన అవంతి : తీర్మానం ఆమోదం..!
ఏపీ శాసనసభలో మరో సారి ఏపీకీ ప్రత్యేక హోదా కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసారు. ఈ సమయంలోనే వైసీపీ..టీడీపీ మధ్య మాటల యుద్దం సాగింది. ముఖ్యమంత్రి జగన నేరుగా ప్రతిపక్ష నేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని హోదా రాకపోవటానికి కారణమం అయనే అంటూ ఫైర్ అయ్యారు. కేంద్రంతో సన్నిహితంగా ఉంటూనే..హోదా కోసం ఒత్తిడి చేస్తామని ప్రకటించారు. గతంలో ప్యాకేజి కోసం చేసిన తీర్మానం స్థానంలో హోదా మాత్రమే కావాలి అంటూ తీర్మానం చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఇదే సమయంలో హోదా గురించి నాడు అధికార పార్టీలో ఏం జరిగిందో మంత్రి అవంతి శ్రీనివాస్ గుట్టు రట్టు చేసారు.
ప్యాకేజి కాదు..హోదానే కావాలి..
ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ఏపీకీ ప్రత్యేక హోదా కోరుతూ స్టేట్మెంట్ చేసారు. అదే సమయంలో హోదా కోరుతూ తీర్మానం ప్రతిపాదించారు. ఆ సమయంలో నాటి ప్రభుత్వం హోదాను పట్టించుకోకుండా..ప్యాకేజి పేరుతో డ్రామాలు ఆడిందని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. గతంలో ప్యాకేజిని అభినందిస్తూ చేసిన తీర్మానం స్థానంలోనే మాకు హోదా మాత్రమే కావాలంటూ ఈ తీర్మానం చేస్తున్నట్లు వివరించారు. విభజన సమయంలో జరిగిన నష్టాన్ని వివరిస్తూ ఏపీకీ హోదా వస్తేనే కష్టం నుండి బయటపడగలుగుతామని చెప్పుకొచ్చారు. విభజన సమయంలో చేసిన వాగ్దానాలను అమలు చేయాలని తీర్మానంలో ప్రతిపాదించారు. అయిదు కోట్ల మంది తరపున హోదా కోసం ఈ తీర్మానం చేస్తున్నామని ప్రకటించారు. అదే సమయంలో చంద్రబాబు నాడు కేంద్ర కేబినెట్ చేసిన తీర్మానం పైన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రయత్నం చేసి ఉంటే హోదా వచ్చేది ఉండేదని జగన్ వ్యాఖ్యానించారు.
ఇక హోదా బాధ్యత మీదే..వైసీపీ పంచ్లు
ముఖ్యమంత్రి స్టేట్మెంట్తో పాటుగా తీర్మానం పైన చంద్రబాబు స్పందించారు. తాను 29 సార్లు ఢిల్లీ వెళ్లానని నాటి కేంద్ర ఆర్దిక మంత్రి ఇచ్చిన హామీ మేరకే తాము ప్యాకేజికి ఒప్పుకున్నామని..అయితే, ఆ తరువాత మాట తప్పటంతో కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు వచ్చామని చంద్రబాబు వివరించారు. చంద్రబాబు 29 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారని..శాలువాలు కప్పటానికి..మెమెంటోలు ఇవ్వటానికి వెళ్లారంటూ జగన్ వ్యాఖ్యానించారు. తాను పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపకుండా ప్రమాణ స్వీకారం చేయనని చెప్పటంతో.. దీనికి సీఎం స్పందించారు. చంద్రబాబు ముంపు మండలాలు కలపకపోతే ప్రమాణం చేయనని చెప్పామంటున్నారు.. మరి..హోదా ఏం పాపం చేసింది చంద్రబాబు అని ప్రశ్నించారు. ఇక, మీరు 22 ఎంపీలు గెలిచారని..హోదా మీరు సాధించాలని..మీకు మద్దతు గా నిలుస్తామని చెబుతూ చంద్రబాబు తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
గుట్టు రట్టు చేసిన అవంతి..
ప్రత్యేక హోదాపై చర్చ సమయంలో మంత్రి అవంతి శ్రీనివస రావు నాడు టిటీడీ హయాంలో ఏం జరిగిందో గుట్టు రట్టు చేసారు. హోదా కోసం జగన్ ప్రజల్లోకి వెళ్తున్నాడు..మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాడు యూ టర్న్ తీసుకున్నారని చెప్పుకొచ్చారు. అదే విధంగా తాను హోదా కోసం నిరహారదీక్ష చేస్తానని చెబితే..దీక్ష చేస్తే పార్టీ నుండి తప్పిస్తానని..అక్కడ ఉప ఎన్నిక వస్తుందని చంద్రబాబు హెచ్చరించారంటూ అసలు విషయం బయట పెట్టారు. అదే సమయంతో తనకు సుజనా చౌదరి ఫోన్ చేసి నువ్వు ఒక్కడివే ఎంపీవా..మిగిలిన వారు ఎంపీలు కాదా అని ప్రశ్నించారని వివరించారు. సందర్భానుసారం చంద్రబాబు మాట మార్చారని..హోదా విషయంలో ఒకటే మాట మీద నిలబడ్డారని అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.