నేడు గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ చెయ్యనున్న ఏపీ సీఎం జగన్
అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం శుభ వార్త చెప్పిన విషయం తెలిసిందే . ఎన్నికల హామీల అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితుల ఆదుకుంటామని ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 264,99,00,983లను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మొత్తాన్ని మొదట రాష్ట్రంలోని 13 జిల్లాలో రూ.10 వేల లోపు డిపాజిట్లు కలిగిన 3,69,655 మందికి పంపిణీ చెయ్యాలని నిర్ణయించిన సర్కార్ నేటి నుండి అగ్రి గోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ చెయ్యనుంది.
పొదుపు మాట దేవుడెరుగు.. కొంప ముంచిన గోల్డ్ స్కీమ్..!
గుంటూరులో నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రిగోల్ద్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు . గుంటూరు జిల్లాలో అగ్రిగోల్డ్లో పదివేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన వారు 19,751 మంది ఉన్నారు. వీరందరికీ చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.14.09 కోట్లు విడుదల చేసింది. ఈ సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడతారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ చేసి వారికి భరోసా ఇస్తారు.
వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే అగ్రిగోల్ద్ బాధితులకు అండగా నిలిచారు. గత టీడీపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. అగ్రిగోల్ద్ బాధితులను ఆదుకుంటా అని భరోసా ఇచ్చారు. అంతేకాదు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్లో రూ.1,150 కోట్లు కేటాయించారు సీఎం జగన్. ఇక నేటి నుండి విడతల వారీగా అగ్రిగోల్డ్ బాధితులకు ఆపన్న హస్తం అందించనున్నారు.
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు దానిని నిలబెట్టుకోవడం పట్ల అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తుంది.బాధితులకు చెక్కులు పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో తలపెట్టిన దీక్షలను రద్దు చేయనున్నట్టు అసోసియేషన్ బాధ్యులు తెలిపారు. ఇక ఈ విషయాన్ని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్కుమార్ ప్రకటన చేశారు.