సంక్రాంతి పండక్కి జగన్ షెడ్యూల్ ఇదే: ఎక్కడికెళ్తున్నారంటే?: ఆ ఆనవాయితీకి చంద్రబాబు పుల్స్టాప్
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎల్లుండి గుంటూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. జిల్లాలోని నరసరావుపేటలో ఆలయాన్ని సందర్శించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించ తలపెట్టిన గోపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. టీటీడీ నిర్వహిస్తోన్న గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా.. ఆ ఆలయానికి గోవును అందజేస్తారు. అక్కడే సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. జిల్లాకు చెందిన హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
మోడీ సర్కార్కు సుప్రీంకోర్టు డెడ్లైన్: మళ్లీ అఫిడవిట్: నాడు వైఎస్ జగన్ వ్యవహారంలో: నేడు..?
గుడికో గోమాత పేరు మీద టీటీడీ.. దేశంలోని అన్ని ప్రధాన ఆలయాలకు గోవును బహూకరిస్తోన్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ ఇప్పటికే గోవులను అందజేసే కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. తాజాగా సంక్రాంతి పండుగ నాడు నరసరావుపేటలోని ఓ దేవస్థానానికి గోవులను అందజేయనుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి హాజరు కావాలని వైవీ సుబ్బారెడ్డి ఇదివరకే వైఎస్ జగన్కు ఆహ్వానం అందించారు. దీనికి ఆయన అంగీకరించారని తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రతి సంక్రాంతికి తన సొంత గ్రామం చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెకు వెళ్లడం ఆనవాయితీ. అధికారంలో ఉన్న అయిదేళ్లూ ఆయన సంక్రాంతి పండుగను కుటుంబంతో సహా నారావారి పల్లెలో జరుపుకొన్నారు. భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్తో కలిసి సొంతూరిలో సంక్రాంతి వేడుకలను జరుపుకొనే వారు. ఈ సారి ఆయన అక్కడికి వెళ్లట్లేదని తెలుస్తోంది. ఆ ఆనవాయితీకి చంద్రబాబు పుల్స్టాప్ పెట్టినట్టే కనిపిస్తోంది. హైదరాబాద్లోనే ఆయన సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారని తెలుస్తోంది.