సీఆర్డీయేపై మరో కీలక నిర్ణయం- రాజధాని గ్రామాల్లో యూనిట్ ఆఫీసుల తరలింపు...
ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్ధ సీఆర్డీయే విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల ఏర్పాటు, ఇతర పరిణామాల నేపథ్యంలో అమరావతి పరిధిలో ఉన్న యూనిట్ కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించింది. ఈ యూనిట్ కార్యాలయాలను తుళ్లూరులోని సీఆర్డీయే ప్రాంతీయ కార్యాలయానికి తరలిస్తున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం లభించిన నేపథ్యంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏఎంఆర్డీయే) పేరుతో ప్రభుత్వం మరో కొత్త కార్పోరేషన్ను ఏర్పాటు చేసింది. అనంతరం సీఆర్డీయే కార్యకలాపాలను తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం రాజధాని గ్రామాల్లో ఉన్న సీఆర్డీయే యూనిట్ కార్యాలయాల్లో ఎలాంటి కార్యకలాపాలు సాగకపోవడంతో వీటిని తుళ్లూరులోని ప్రాంతీయ కార్యాలయంలో కలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Recommended Video
ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం రాజధానిలోని మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఏడు గ్రామాలు, తాడేపల్లి మండలంలోని రెండు గ్రామాల్లోని యూనిట్ కార్యాలయాలు మూతపడుతున్నాయి. దీంతో ఇంతవరకూ యూనిట్ కార్యాలయాల్లో సాగిన కార్యకలాపాలు ఇకపై తుళ్లూరు ప్రాంతీయ కార్యాలయం నుంచే సాగనున్నాయి. సీఆర్డీయే చట్టం రద్దు వ్యవహారం హైకోర్టులో పెండింగ్ ఉన్న నేపథ్యంలో అప్పటి వరకూ తుళ్లూరు కార్యాలయమే రాజధాని కేంద్రం కానుంది.