నిమ్మగడ్డ వర్సెస్ జగన్ సర్కార్: ఆ హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు ఉంది: మాజీ సీఎస్ ఎల్వీ
గుంటూరు: రాష్ట్రంలో ప్రస్తుతం అందరి దృష్టి పంచాయతీ ఎన్నికల మీదే నిలిచింది. తొలిదశ ఎన్నికలను నిర్వహించడానికి అవసరమైన నోటిఫికేషన్ను కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం ఏ మాత్రం ఆసక్తి కనపర్చట్లేదు. విధులను బహిష్కరించడానికి, సమ్మెకు వెళ్లడానికీ వెనుకాడట్లేదు. ఈ వివాదం కాస్తా డీజీపీ కార్యాలయానికీ చేరింది. ఏపీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరాలు వ్యక్తమౌతోన్నాయి.
ఎవరూ సమర్థించరు..
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వర్సెస్ ప్రభుత్వ అధికార, పోలీసు యంత్రాంగం మధ్య యుద్ధంలా నడుస్తోంది ఈ పరిణామం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యనాలు చేశారు. ఎన్నికలను నిర్వహించే విషయంలో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం మధ్య నెలకొన్న పరిణామాలు అవాంఛనీయమైనవని అన్నారు. మేధావి వర్గాలు వాటిని సమర్థించబోవని చెప్పారు.
రాజయాంగానికి లోబడి..
ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన గుంటూరు జిల్లా తెనాలికి వచ్చారు. గ్రామ స్థాయిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సిన ఉంటుందని, ప్రజల ప్రాణాలను తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ కార్యాలయం అయినా.. ప్రభుత్వ ఉద్యోగులు అయినా.. రాజ్యాంగానికి లోబడే తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని చెప్పారు. రాజ్యాంగానికి లోబడి ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని అభిప్రాయపడ్డారు.
సమ్మెకు వెళ్తామనడం సరికాదంటూ..
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత.. సమ్మెకు వెళ్తామనడం, విధులను బహిష్కరిస్తామని హెచ్చరించడం సరికాదని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి వివాదం గానీ, పరిస్థితులు గానీ తలెత్తిన సందర్భాలు లేవని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో త్యాగాలకు సిద్ధపడక తప్పక పోవచ్చని ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. రాజ్యాంగబద్ధంగా విధులను నిర్వర్తించిన అధికారులు ప్రజల మనస్సుల్లో చిరకాలం నిలిచిపోతారని చెప్పారు. అలాంటి అధికారులను ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పారు.
ప్రాణాలకు రక్షణ కల్పించే చర్యల కోసం డిమాండ్..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని తాను వ్యాఖ్యానించలేనని అన్నారు. ఉద్యోగులు ప్రాణాలను త్యాగం చేయాల్సిన అవసరం రాకవచ్చని అన్నారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అవసరమైన రక్షణాచర్యలను తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు ఉందని అన్నారు. ధర్మో రక్షతి రక్షితః అన్నట్టు.. మనం రాజ్యాంగాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని ఎల్వీ చెప్పారు.