జగన్ విసిరే బిస్కెట్ల కోసం కక్కుర్తి పడుతోన్న బాడుగ నేతలు: ఉద్యోగ సంఘాల నేతలపై పట్టాభి ఫైర్
గుంటూరు: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటీషన్లు విచారణలో ఉన్న వేళ.. ఎలాంటి తీర్పు వస్తుందోననే ఉత్కంఠత నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నేతలు.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు..రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య మాటల యుద్ధం తీవ్రమౌతోంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనలేమంటూ ఏపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చేస్తోన్న ప్రకటనలను తెలుగుదేశం పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Recommended Video
జగన్..ఎన్డీఏ వైపే?: హోదా ఇస్తే ఎందాకైనా: మోడీ అఖిల పక్షానికి ముందే ఆ నిర్ణయం: ఎంపీలతో
బిస్కెట్లకు కక్కుర్తి పడుతున్నారంటూ..
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగ నేతలు తాడేపల్లి ప్యాలెస్కు సరెండర్ అయ్యారని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ వేసే బిస్కెట్లకు కక్కుర్తి పడుతున్నారని కొంతమంది ఉద్యోగ సంఘాల ప్రతినిదులు బాడుగ నేతల్లా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇలాంటి దిక్కుమాలిన ఉద్యోగ సంఘాల నేతలు చరిత్రలోనే లేరని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తోక ఊపుకొంటూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు.
జీపీఎఫ్, జీఎల్ఐ నిధులొస్తున్నాయా?
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు మంజూరు కావాల్సిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్), గవర్నరమెంట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ (జీఎల్ఐ) నిధులు స్తంభించిపోయాయని, దానిపై ఇప్పటిదాకా ఎందుకు నోరు మెదపట్లేదని పట్టాభిరామ్ ప్రశ్నించారు. రిటైర్మెంట్ గ్రాట్యుటీ బెనిఫిట్స్ అందుతున్నాయా? అని నిలదీశారు. సీపీఎస్ రద్దు గురించి బాడుగ నేతలు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో సీపీఎస్లో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచిందని అన్నారు.
పీఆర్సీ ఏమైంది?
2018లో ఏప్రిల్లో తమ ప్రభుత్వం పీఆర్సీపీ ఏర్పాటు చేసిందని, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదని పట్టాభిరామ్ అన్నారు. ఆ దమ్ము ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు లేదా? అని ప్రశ్నించారు. ఏపీ ఉద్యోగ సంఘాల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. వెంకట్రామిరెడ్డి ఓ పనికిమాలిన నాయకుడని విమర్శించారు. ప్రభుత్వం ఆరు డీఏలు, ఎల్టీసీలను పెండింగ్లో పెట్టిందని, దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్, పదవీ విరమణ వయస్సును పెంచింది చంద్రబాబు ప్రభుత్వమేనని చెప్పారు.
నామినేషన్ విధులకు ఎందుకు హాజరు కావట్లేదు..
ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా జారీ చేసిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విధులకు ప్రభుత్వ ఉద్యోగులు దూరం కావడం నేరమని అన్నారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి అవమానిస్తున్నారని పట్టాభిరామ్ అన్నారు. ఉద్యోగ సంఘాలను నడిపించలేకపోతే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయా నేతల వైఖరి వల్ల లక్షలాది మంది ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా తాడేపల్లి ప్యాలెస్కు గులాంగిరి చేయడాన్ని మానుకోవాలని సూచించారు. అప్పటిదాకా తాను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు.