సత్తెనపల్లి మసీదులో 10 మంది విదేశీయులు- కేసు నమోదు - క్వారైంటైన్ కు..
ఏపీలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మసీదులో 10 మంది విదేశీయుల ఆశ్రయం వార్తలు కలకలం రేపుతున్నాయి. స్దానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి క్వారంటైన్ కు తరలించారు.
లాక్ డౌన్ ఉల్లంఘించి మసీదులో...
ఏపీలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని పెద్ద మసీదులో పది మంది విదేశీయులు ఆశ్రయం పొందిన ఘటన చోటుచేసుకుంది. స్ధానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు విదేశీయులపై ఏపీ అంటువ్యాధుల వ్యాప్తి నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసి వారిని క్వారంటైన్ కు తరలించినట్లు స్ధానిన పోలీసులు నిర్ధారించారు.
కజక్, కిర్గిజ్ దేశీయులు...
ఏపీలో గత నెల 24 నుంచి కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇప్పటికే ఢిల్లీతో పాటు విదేశాల నుంచి వచ్చిన వారి కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వేల సంఖ్యలో బాధితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో పాజిటివ్ గా తేలిన వారిని క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇప్పుడు సత్తెనపల్లి మసీదులో కజకిస్ధాన్ తో పాటు కిర్గిజ్ రిపబ్లిక్ కు చెందిన పది మంది ఆశ్రయం పొందడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పర్యాటక వీసాలపై వచ్చి...
గత నెలలో పర్యాటక వీసాలతో ఈ పది మంది సత్తెనపల్లి చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే లాక్ డౌన్ కొనసాగుతుండటం, విదేశీ పర్యాటకుల విషయంలో ప్రభుత్వాలు సీరియస్ గా ఉండటం, విదేశీ విమానయాన సర్వీసులు రద్దు కావడం వంటి కారణాలతో వీరంతా మసీదులో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. స్ధానికుల సాయంతో వీరు సత్తెనపల్లి వచ్చినప్పటికీ పట్టణంలో ఆశ్రయం దొరక్క వీరంతా మసీదులోనే ఉండిపోయారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వీఆర్వో పిర్యాదుతో కేసు...
సత్తెనపల్లి మసీదులో పది మంది విదేశాలకు చెందిన ముస్లింలు ఆశ్రయం పొందినట్లు స్ధానికంగా ఓ వ్యక్తి నుంచి అందిన ఫిర్యాదు మేరకు వీఆర్వో శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. అయితే వీరిని ఎవరు ఎప్పుడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే అంశాలపై విచారణ జరుపుతున్న పోలీసులు.. వీరిని తక్షణం క్వారంటైన్ కు తరలించారు. ఏపీ అంటువ్యాధుల వ్యాప్తి నియంత్రణ చట్టం కింద మోసం, అంటువ్యాధుల వ్యాప్తికి కారణం కావడం, ఇతరులకు ప్రాణహాని కల్గించడం, లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన వంటి ఆరోపణలపై వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.