మాజీ స్పీకర్ కోడెలపై కేసు నమోదు.. అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో ఉచ్చు..!
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయనతో పాటు కొడుకు శివరామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లింపుపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వర్ రావు చేసిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు తండ్రీ తనయులపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 409, 411 కింద కేసు ఫైల్ చేసినట్లు తెలుస్తోంది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ సీనియర్ నేతగా కోడెల శివప్రసాద్ రావు అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. అయితే ఉమ్మడి ఏపీ విభజన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీ అసెంబ్లీని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మించిన భవన సముదాయానికి తరలించారు. సరిగ్గా ఆ సమయంలోనే కోడెల అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
లిఫ్ట్ అడిగి యువతి కిరాక్ పని.. కాస్ట్లీ బైకుతో పరార్..!
హైదరాబాద్ నుంచి వెలగపూడికి తరలించాల్సిన ఫర్నీచర్ను కోడెల శివప్రసాద్ రావు గుంటూరులోని తన కార్యాలయంతో పాటు సత్తెనపల్లిలోని తన నివాసానికి తరలించినట్లు రుజువైంది. విషయం కాస్తా ఇటీవల రచ్చ రచ్చ కావడంతో ఆయన కూడా స్పందించారు. మొత్తానికి అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వర్ రావు ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కోడెలతో పాటు ఆయన తనయుడు శివరామకృష్ణపై కేసు నమోదు చేశారు.
అయితే ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న కోడెల రివర్స్ గేర్ వేశారు. విషయం కాస్తా పెద్దదిగా మారడంతో ఆయన రంగంలోకి దిగారు. కొంత ఫర్నీచర్ తన కార్యాలయంలో వాడుకున్నట్లు ఒప్పుకున్నారు. అయితే గతంలో ఎన్నోసార్లు ఫర్నీచర్ తీసుకెళ్లాలంటూ అసెంబ్లీ అధికారులకు లిఖిత పూర్వకంగా లేఖలు రాసినప్పటికీ వారు స్పందించలేదని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ నుంచి ఎవరైనా అధికారులు వస్తే ఫర్నీచర్ అప్పగిస్తానని లేదంటే ఎంత చెల్లించాలో నిర్ణయిస్తే ఆ మొత్తం చెల్లించడానికి సిద్ధమేనని పేర్కొనడం గమనార్హం.