డీజీపీ ఆఫీస్ ఎదుట చంద్రబాబు ధర్నా: ‘యేసుక్రీస్తులా కాపాడాడు’ అంటూ బోండా ఉమ
అమరావతి: గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమా మహేశ్వరరావు, బుద్దా వెంకన్నపై జరిగిన దాడి ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి డీజీపీకి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
డీజీపీ ఆఫీసు ముందు చంద్రబాబు ధర్నా..
అంతకుముందు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయం వరకు చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారు. దాడిలో గాయపడిన టీడీపీ నేతలతోపాటు దెబ్బతిన్న వారి వాహనాలతో ఆయన ర్యాలీగా డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో చంద్రబాబు సహా నేతలెవరూ లోపలికి ప్రవేశించకుండా పోలీసులు గేట్లను మూసివేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలు, సీపీఐ రాష్ట్ర కార్యద్రశి రామకృష్ణ డీజీపీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకపాలన కొనసాగిస్తోందని ఆయన మండిపడ్డారు. యాత్రలో భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఆ దాడి భయానకం..
కాగా, డీజీపీ కార్యాలయం వద్ద బైఠాయించిన చంద్రబాబు వద్దకు శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్ వచ్చి చర్చలు జరిపారు. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని, ఆందోళన విరమించాలని కోరారు, కాగా, మాచర్ల దాడి ఘటనపై చంద్రబాబు డీజీకి వివరించారు. ఈ సందర్భంగా దాడిలో గాయపడిన బోండా ఉమా, బుద్ధా వెంకన్నలు తమ గాయాలను డీజీకి చూపించారు. దాడి ఘటన భయానకమని వివరించారు.
యేసుక్రీస్తులా కాపాడాడు..
అంతకుముందు టీడీపీ కార్యాలయంలో బోండా ఉమా మాట్లాడుతూ.. బుద్ధా వెంకన్నతోపాటు తనను హత్య చేయాలని వైసీపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు ఆపడంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు న్యాయవాది సహా మూడు కార్లలో మాచర్ల వెళ్లామని.. వైసీపీ నేతలు కారంపూడి నుంచి తమ వాహనాన్ని అనుసరించారని చెప్పారు. వైసీపీ నేత తురక కిశోర్ సహా 30 మంది కార్యకర్తలు కర్రలు, రాళ్లతో తమ వాహనంపై దాడి చేశారని బోండా తెలిపారు. ఆ సమయంలో కారు డ్రైవర్ యేసు.. యేసుక్రీస్తుల తమను అక్కడ్నుంచి తీసుకెళ్లి కాపాడారని బోండా ఉమా చెప్పుకొచ్చారు.
చంపేందుకే కుట్ర.. దేవుడిలా డీఎస్పీ.. వైసీపీకి సవాల్..
ఆ తర్వాత మాచర్ల దాటి వెళ్తుండగా మరికొంత మంది దాడి చేశారని చెప్పారు. వెల్దుర్తి దాటగానే మరో 200 మంది రోడ్డు పక్కన ఉన్నారని తెలిపారు. పోలీసులు వచ్చి తమను కాపాడారని బోండా ఉమ తెలిపారు. గురజాల డీఎస్పీ వాహనంపైనా దాడి చేసేందుకు ప్రయత్నించారని అన్నారు. దాడి జరిగిన సమయంలో గురజాల డీఎస్పీ దేవుడిలా వచ్చారని.. ఆయన రాకుంటే తమను చంపేసేవారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ప్రయాణిస్తున్న కారు బాలుడిని ఢీకొట్టిందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ రేపు మాచర్ల వస్తామంటూ పిన్నెల్లికి ఉమ సవాల్ విసిరారు. మాచర్లలోనే వైసీపీకి సమాధానం చెప్పే సత్తా తమకుందని అన్నారు. పావుగంటపాటు తమ వెంటపడి చంపాలని ప్రయత్నించారని, మారణాయుధాలతో దాడి చేసేందుకు 150 మంది చుట్టుముట్టారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. డీఎస్పీ లేకుంటే తాము దాడి నుంచి బయటపడేవారిమి కాదని చెప్పారు.