జగన్ సర్కారుకు షాక్- గుంటూరులో నామినేషన్లు ప్రారంభం- మిగతాచోట్ల టీడీపీ, జనసేన ధర్నాలు
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఎట్టి పరిస్ధితుల్లోనూ ప్రారంభం కాకుండా అడ్డుకుంటున్న వైసీపీ సర్కారుకు గుంటూరులో అధికారులు షాకిచ్చారు. జిల్లాలో పలు చోట్ల పంచాయతీ ఎన్నికల తొలి విడత ఎన్నికలకు నామినేషన్లను అధికారులు స్వీకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులు నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టకుండా పంచాయతీ ఆఫీసులకు తాళాలు వేసిన నేపథ్యంలో గుంటూరులో రిటర్నింగ్ ఆఫీసర్లు తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. ఇదే కోవలో మిగతా చోట్ల కూడా నామినేషన్లు ప్రారంభించాలని టీడీపీ, జనసేన పార్టీలు నిరసనకు దిగుతున్నాయి.
Recommended Video
గుంటూరులో నామిషన్ల స్వీకరణ మొదలు..
ఏపీలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలను రాష్ట్రమంతా అధికారగణం ధిక్కరిస్తున్న వేళ గుంటూరు జిల్లాలో మాత్రం రిటర్నింగ్ అధికారులు కొద్దిసేపటి క్రితం నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. ఎస్ఈసీ ఆదేశాలు పాటిస్తూ అభ్యర్దుల నుంచి పలుచోట్ల నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇక్కడ కలెక్టర్ శామ్యూల్ స్ధానంలో జాయింట్ కలెక్టర్ సాయంతో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని ఎస్ఈసీ ఇప్పటికే నిర్ణయించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల ప్ర్రక్రియ ప్రారంభించడంతో అభ్యర్ధులు ఎంపీడీవో కార్యాలయాలకు తరలివస్తున్నారు.
గంటూరు జిల్లాలో నామినేషన్లు ఇక్కడే...
గుంటూరు జిల్లాలో జేసీ ఆదేశాల మేరకు నామినేషన్ల ప్రక్రియ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో తొలి నామినేషన్ దాఖలు కాగా.. తక్కెళ్లపాడులోనూ నామినేషన్లు ప్రారంభమయ్యాయి. పార్టీలకతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతిస్తున్న అభ్యర్ధులు ఇక్కడ నామినేషన్లు వేశారు. ప్రత్తిపాడు మండలంలోనూ స్టేజ్-1 ఆఫీసర్లకు ఓటర్ల జాబితా ఇచ్చి నామినేషన్లు తీసుకోవాలని ఎంపీడీవో విజయలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు.
ఫిర్యాదులకు చంద్రబాబు పిలుపు- జనసేన ధర్నాలు
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోరును అడ్డుకోవాలని వైసీపీ సర్కారు చూస్తున్నా గుంటూరు జిల్లాలో నామినేషన్లు ప్రారంభం కావడంపై టీడీపీ, జనసేన నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో మిగతా జిల్లాల్లోనూ అధికారులు ఇప్పటికైనా నామినేషన్ల స్వీకరణ మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల పంచాయతీ కార్యాలయాలకు చేరుకుని ఆఫీసులు తెరవాలని ధర్నాలు చేపడుతున్నారు. మరోవైపు అభ్యర్ధులు నామినేషన్లకు సిద్ధంగా ఉన్నప్పటికీ పంచాయతీ ఆఫీసులు తెరవకపోవడంపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు వారికి పిలుపునిచ్చారు.