ఏపీలో టీడీపీని టార్గెట్ చేస్తున్న బీజేపీ..! గుంటూరులో ఖాళీ కాబోతున్న సైకిల్ పార్టీ..?
Recommended Video
అమరావతి/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుంటూరు జిల్లాలో ఆ పార్టీకి కష్టాలు ఎదురుకాబోతున్నాయి. పార్టీ నేతలందరూ కకావికలం అవుతుండంతో పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు తలెత్తాయి. ఓ పక్క నేతలు పార్టి మారుతుండడం, మరో పక్క ఉన్న నేతలకు ప్రజల్లో విశ్వసనీయత లేకపోవడంతో ఉనికి కోల్పోయే పరిస్థితులు తలెత్తాయి. దీంతో గుంటూరు జిల్లాలోనే మకాం వేసిన చంద్రబాబు నాయుడుకు కాస్త ఇబ్బందికర పరిణామాలు తలెత్తాయి. పార్టీ లో పాత నాయకులు వెళ్లిపోతే కొత్త నేతలను తయారు చేసుకుంటామని పైకి చెప్పుకొస్తున్నప్పటికి టీడిపి లోలోపల మదన పడుతున్నట్టు చర్చ జరుగోతంది.
ఆ ఒక్క కారణంతోనే బీజేపిలో చేరాను..! కమలం పార్టీలో చేరిక
గుంటూరులో టీడిపీ ఔట్..! బీజేపి గాలాపికి చిక్కుతున్న పచ్చ చేపలు..!!
ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. తన బలం, బలగం పెంచుకునేందుకు తీవ్రంగానే కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా టీడీపీ నాయకులను టార్గెట్ చేసింది. ఆ పార్టీ నుంచి ఎవరొచ్చినా కండువాలు కప్పేస్తోంది. ముందుగా టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లడంతో ప్రారంభమైన ఈ వలసలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు... తాజా ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు సైతం బీజేపీకి గూటికి చేరుతున్నారు. వరదాపురం సూరి వంటి నేతలు కూడా పార్టీ మారిపోయారు. ఇప్పుడు గుంటూరు నుంచి కూడా కొందరు కీలక నేతలు బీజేపీ బాటలో ఉన్నారు.
ఉనికి కోల్పోయే ప్రమాదం..! కమలంలోకి క్యూ కడుతున్న నేతలు..!!
గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ తాజా మాజీ మంత్రి కూడా బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ జిల్లా టీడీపీ కీలక నేతలపై వల వేసి పట్టుకునే రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరికి బీజేపీ పెద్దలు అప్పగించారు. సుజనా చౌదరి గత రెండు ఎన్నికల్లోనూ జిల్లాలో కొందరికి టిక్కెట్లు ఇవ్వడం ద్వారా తన వర్గంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వారిని బిజెపిలోకి లాగే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. నేతల బలహీనతలను గుర్తించి వ్యూహాత్మకమైన మైండ్ గేమ్ ద్వారా వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
బలమైన సామాజిక వర్గం..! టీడిపిని కాదంటోంది..!!
ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ, టీడీపీ బాపట్ల ఇన్ చార్జ్ అన్నం సతీష్ ప్రభాకర్, ఏకంగా పార్టీతోపాటు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. రేపోమాపో బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో సుజనా చౌదరితో ఎంతో సన్నిహితంగా ఉండే మరో ఇద్దరు టీడీపీ సీనియర్లు కూడా సుజనా వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరూ కూడా బయటకు వెళితే... ఈ జిల్లాలో టీడీపీ ఖాళీ అయినట్టే. గతంలో గుంటూరు నుంచి ఓడిపోయిన టీడీపీ నేత టీవీ రావు కూడా ఇప్పటికే బీజేపీలో చేరారు.
అయోమయంలో అదిష్టానం..! బీజేపి పై మండిపడుతున్న బాబు..!!
మరో సీనియర్ నేత, గతంలో దుగ్గిరాల నుంచి పోటీ చేసి ఓడిన సాంబశివరావు కూడా కాషాయ కండువా కప్పుకునేందుకు తహతహలాడుతున్నారు. టీడీపీ నుంచి రేపల్లె ఎమ్మెల్యేగా గెలిచిన అనగాని సత్యప్రసాద్, ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. తాను పార్టీ మారడం లేదని ఆయన పైకి చెప్పినప్పటికీ, తన వ్యాపార అవసరాల కమలం గూటికి రేపోమాపో వెళతారు. ఇలా గుంటూరు జిల్లాలో టీడీపీని ఖాళీ చేయించేందుకు సుజనా చేపట్టిన 'ఆపరేషన్' సక్సెస్ అయినట్టే అనిపిస్తోంది. ఆ తరువాత, ఏ జిల్లాలో 'ఆపరేషన్' మొదలవుతుందో, ఎవరు చేపడతారో చూడాలి.