అతి తెలివి అంటే ఇదే: బాత్రూమ్ను మద్యం దుకాణంగా మార్చేశాడు: భారీగా లిక్కర్ బాటిళ్లు స్వాధీనం.. !
గుంటూరు: సంక్షోభ సమయాన్ని అవకాశంగా మార్చుకోవడం అంటే బహుశా ఇదేనేమో. కరోనా వైరస్ వెంటాడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. నిత్యావసర సరుకులు మినహా మరేవీ అందుబాటులో ఉండట్లేదు. కిరాణా దుకణాలు అన్ని షాపులూ మూత పడ్డాయి. మద్యం దుకాణాలకు అసలు అనుమతే లేదు. సాధారణ రోజుల్లోనే మద్యం అమ్మకాలపై నియంత్రణ కొనసాగుతోంది. దుకాణాల నిర్వహణపై ఆంక్షలు అమల్లో ఉన్నాయి.
లాక్డౌన్ వల్ల జనజీవనం స్తంభంచింది. జనం అందరూ గుమ్మం దాటట్లేదు. ఇంటిపట్టునే ఉంటున్నారు. దీన్ని సొమ్ము చేసుకోవాలనుకున్నాడో వ్యక్తి. అతని పేరు దేవరకొండ రాజిరెడ్డి. గుంటూరు జిల్లాలోని నరసరావు పేట ప్రకాశ్ నగర్ విద్యావిహార్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. లాక్డౌన్ వల్ల ఏర్పడిన పరిస్థితులను సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిందే ఆలస్యం.. ఇంప్లిమెంట్ చేశాడు.
ఏపీకి ఆనుకుని ఉన్న తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లను తెప్పించుకున్నాడు. వాటిని తాను నివసించే అపార్ట్మెంట్ ఫ్లాట్లోనే బాత్రూమ్లో దాచి ఉంచాడు. అక్కడి నుంచే వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. లాక్డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఇళ్ల వందే ఉండాల్సి రావడంతో.. మద్యానికి మంచి డిమాండే లభించిందట. వారం రోజులుగా యథేచ్ఛగా మద్యం బిజినెస్ను కొనసాగిస్తున్నాడు.
దీనిపై పక్కా సమాచారం అందడంతో పోలీసులు, ఎక్సైజ్, ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఉమ్మడిగా దాడి చేశారు. బాత్రూమ్లో దాచి ఉంచిన మద్యం బాటిల్ కేసులను స్వాధీనం చేసుకున్నారు. రాజిరెడ్డిపై కేసు నమోదు చేశారు. పంచనామా నిర్వహిస్తున్నారు. మద్యం బాటిళ్ల విలువ లక్షల రూపాయల్లో ఉంటుందని చెబుతున్నారు. అంజిరెడ్డిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన సహా ఎక్సైజ్ చట్టం కింద అతనిపై కేసులు పెట్టినట్లు వెల్లడించారు.