చంద్రబాబు 100 కోట్లు ఇస్తానన్నాడు.. అందుకే మునిగిపోయాం.. రాయపాటి సంచలన వ్యాఖ్యలు
పోలవరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులెన్నో పట్టేసిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై ఇటీవల సీబీఐ దాడులు చేయడం, అక్రమంగా నిధుల మళ్లించారంటూ కేసులు నమోదు చేయడంపై ఆ కంపెనీ ప్రమోటర్, టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రోజువారీ వ్యవహారాలతో తనకు సంబంధమేలేదని, డైరెక్ట్ హోదాలో కేవలం బ్యాలెన్స్ షీట్లపై సతకాలు మాత్రమే పెడతానన్నారు. తనపై కేసులు.. సీబీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొందరపాటు చర్య అని, అతి త్వరలో వాళ్లే తమ తప్పు తెల్సుకుంటారని చెప్పారు.
నా భార్య చనిపోవడంతో..
ట్రాన్స్ ట్రాయ్ కంపెనీని స్థాపించింది తానే అయినా.. రాజకీయాల్లోకి వచ్చాక అటువైపు వెళ్లడమే మానేశానని, ఎండీ శ్రీధర్, సీఈవోలే మొత్తం వ్యవహారాల్ని చూసుకుంటారని రాయపాటి చెప్పారు. తన భార్య గతంలో ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి డైరెక్ట్ గా ఉండేవారని, ఆమె చనిపోయిన తర్వాత బ్యాలెన్స్ షీట్ పై ఇద్దరి సంతకాలు కావాల్సి రావడంతో నామమాత్రంగా డైరెక్ట్ అయ్యానేగానీ డేటుడే బిజినెస్ తో సంబంధాల్లేవని తెలిపారు. అవసరం ఉన్నప్పుడు తప్ప రెగ్యులర్ గా ఆఫీసుకు కూడా పోయే అలవాటులేదన్నారు. ట్రాన్స్ ట్రాయ్ వ్యవహారాలు తెలియనప్పటికీ.. తనకున్న అవగాహన మేరకు ఎలాంటి మోసాలు, అక్రమాలు జరగలేదన్నారు.
నేను ఏ3నా? నాన్ సెన్స్
తాము బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న మాట వాస్తవమేగానీ, ఆ నిధుల్ని ఇతర పనులకు మళ్లించామని, ట్రాన్స్ ట్రాయ్ మునిగిపోతున్న కంపెనీ అని యూనియన్ బ్యాంక్ ఆరోపించడం ఆక్షేపణీయమని రాయపాటి అన్నారు. కంపెనీ డైలీ రొటీన్ తో సంబధం లేని తనను ఏ3గా పేర్కోవడం సీబీఐ అనాలోచిత చర్య అన్నారు. అతిత్వరలోనే దర్యాప్తు సంస్థలు, ఆరోపణలు చేసిన బ్యాంకులు నిజానిజాలు తెల్సుకుంటాయన్నారు. ఈ వ్యవహారంలో ఎండీ శ్రీధర్ తప్పుకూడా లేదన్నారు.
చంద్రబాబు వల్లే ఈ సమస్యలు..
ఒకప్పుడు ఘనంగా సాగిన ట్రాన్స్ ట్రాయ్ వ్యవహారాలు.. చంద్రబాబు నాయుడి వల్లే దెబ్బతిన్నాయనే అర్థంలో రాయపాటి మాట్లాడారు. ‘‘పోలవరం కాంట్రాక్టులు సాఫీగా సాగిపోవాలన్న ఉద్దేశంతో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు.. మా(ట్రాన్స్ ట్రాయ్) కంపెనీకి బిల్లులు ఆపేసి, సబ్ కాంట్రాక్టర్లుగా వ్యవహరించిన నవయుగ, ఇతర సంస్థలకు బిల్లులిచ్చారు. మాకు రూ.100 ఇస్తామని మాటిచ్చి, తర్వాత నెరవేర్చలేదు. కనీసం ఎన్నికల ఖర్చులకు డబ్బులు కూడా పంపలేదు. దీంతో మేం కష్టాల్లో కూరుకుపోయాం..''అని రాయపాటి వివరించారు.
త్వరలోనే కోలుకుంటాం..
ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ దివాళ తీయబోతోందంటూ యూనియన్ బ్యాంక్ చేసిన ఆరోపణల్ని రాయపాటి ఖండించారు. కంపెనీ రోజువారీ వ్యవహారాలతో తనకు సంబంధం లేనప్పటికీ, ప్రమోటర్ గా, డైరెక్టర్ గా లోపలి వ్యవహారాలు తెలుసని, బయటి నుంచి రావాల్సిన డబ్బులు ఆగిపోవడం కూడా ఇబ్బందుల్ని రెట్టింపు చేశాయన్నారు. ‘‘మాకు కేంద్రం నుంచి రావాల్సన క్లెయిములే 4వేల కోట్ల దాకా ఉంటాయి. బంజారాహిల్స్ లోని మా ఆఫీసును మెట్రో రైలు కోసం కూల్చేసి పరిహారం ఇవ్వలేదు. ఔటర్ రింగు రోడ్డులో కోల్పోయిన భూములకు కూడా డబ్బు రావాల్సి ఉంది. ఇవన్నీ అందితే కంపెనీ ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ త్వరలోనే కోలుకుంటుందని రాయపాటి ఆశాభావం వ్యక్తం చేశారు.