ఎన్నికల వేళ.. సీబీఐ పంజా: అమరావతి పరిధిలో: 6 మంది అధికారులపై: తన పని తాను
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. తొలి విడత నామినేషన్ల పర్వం ఆరంభమైంది. ఒకవంక- నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోండటం, మరోవంక- జగన్ సర్కార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం మధ్య విభేదాలు హైపిచ్కు చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా ఆరు మంది అధికారులపై కేసు నమోదు చేసింది. ఆ ఆరు మందీ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)కు చెందిన అధికారులు. వారితో పాటు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులపైనా సీబీఐ పంజా విసిరింది.
హైపిచ్: సీఎం కోటరీలో కలకలం: జగన్ కుడిభుజాన్ని టార్గెట్ చేసిన నిమ్మగడ్డ: సీఎంఓ కీలక అధికారిపై
ఖాతాదారులు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదును దుర్వినియోగం చేసినట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారులపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. విజయవాడ, గుంటూరుల్లో ఉన్న ఆ బ్యాంకు శాఖా కార్యాలయాల్లో పెద్ద ఎత్తున డిపాజిట్లు గోల్మాల్ అయినట్లు ఫిర్యాదు అందడంతో సీబీఐ అధికారులు రంగ ప్రవేశం చేశారు. ఆరుమంది బ్యాంకు అధికారులతో పాటు వారికి సహకరించినట్లుగా భావిస్తోన్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులపైనా కేసు నమోదైనట్లు సమాచారం.
కొందరు ప్రైవేటు వ్యక్లులకు కూడా ఈ కుంభకోణంలో భాగస్వామ్యం ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. వారిపైనా కేసులు నమోదు చేశారు. ఈ డిపాజింట్ల కుంభకోణంలో మరింతమందిపైనా కేసులు నమోదు చేయవచ్చని తెలుస్తోంది. అమరావతి ప్రాంతం పరిధిలో ఉన్న బ్యాంకులపైనే సీబీఐ అధికారులు నిఘా పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శాఖా కార్యాలయాల్లో డిపాజిట్ చేసిన సొమ్మును దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదు అందడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా దుర్వినియోగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టుకున్నారు. ఆరుమంది బ్యాంకు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలడంతో వారిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సీబీఐ ఇంకా వెల్లడించాల్సి ఉంది. డిపాజిట్ మొత్తాల దుర్వినియోగంలో వారికి సహకరించిన కొందరు ప్రభుత్వాధికారులపైనా కేసు నమోదు చేసినట్లు తేలింది. పంచాయతీ ఎన్నికల కోలాహాలం కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సీబీఐ అధికారులు తమ పని తాము చేసుకుంటూ పోవడం కలకలం రేపుతోంది. ఇదెక్కడి దాకా వెళ్తుందనే విషయం ఉత్కంఠతను రేపుతోంది.