గుంటూరు సీసీఎస్ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ: ముగ్గురి అక్రమ నిర్బంధం కేసు
గుంటూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటరావు , హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు, కానిస్టేబుల్ వీరాంజనేయులుతోపాటు మరికొందరు సిబ్బంది పేర్లతో సి.బి.ఐ కేసు నమోదు చేసింది.
ముగ్గురు వ్యక్తులను అక్రమంగా నిర్బంధించారన్న అభియోగంపై కేసు
క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారని ముగ్గురు వ్యక్తులను అక్రమంగా నిర్బంధించారన్న అభియోగంపై సిసిఎస్ పోలీసులపై కేసు నమోదు చేసిన సిబిఐ ఐపీసీ120బీ,344,348 సెక్షన్ల కింద వారిపై అభియోగాలను నమోదు చేసింది. ఇక అసలు విషయానికి వస్తే క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో 2019 అక్టోబర్ లో గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాకోడూరు కు చెందిన ముగ్గురు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముగ్గురి అక్రమ అరెస్ట్ ... వేధింపులపై సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
నలబోలు ఆదినారాయణ, రాయిడి శ్రీనివాసరావు, తూమాటి శ్రీనివాసరావు లను 2019 అక్టోబర్ లో గుంటూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అక్రమంగా నిర్బంధించారని వారి కుటుంబ సభ్యులు హైకోర్టు మెట్లు ఎక్కారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఢిల్లీ బ్రాంచ్ ఎస్పీ ఎంఎస్ ఖాన్ గుంటూరు సిసిఎస్ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.కోర్టు ఆదేశాలతో విచారణ కొనసాగిస్తున్నారు.
క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారని నిర్బంధించి, డబ్బు కోసం వేధించారని అభియోగాలు
ఏ కేసులో అయినా పోలీసులు అదుపులోకి తీసుకున్న 24 గంటల్లోపు నిందితులను కోర్టులో హాజరు పరచాల్సి ఉండగా, క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేసిన వారి అరెస్టు చూపించక పోగా,నిబంధనలకు విరుద్ధంగా వారిని మూడు రోజులపాటు అక్రమంగా నిర్బంధించి , వేధింపులకు గురి చేశారన్నది బాధిత కుటుంబ సభ్యుల అభియోగం. దీంతో పోలీసులు డబ్బు కోసం తమ అక్రమంగా నిర్బంధించి వేధించారని హైకోర్టును ఆశ్రయించిన క్రమంలోనే కోర్టు సీబీఐ విచారణ జరపాలని ఆదేశాలిచ్చింది.