కోడెల పేరుతో చంద్రబాబు శవ రాజకీయాలు : డిప్యూటీ సీఎం సుచరిత
అమరావతి/ నరసారావుపేట : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పేరుతో శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం సుచరిత. బతికున్నప్పుడు కోడెలను పట్టించుకోని చంద్రబాబు .. కోడెల చనిపోయాక మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కోడెల మాజీ స్పీకర్ అయినందునే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామని ప్రకటించామని ... దానిని కుటుంబసభ్యులు తీసుకోకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. కోడెల మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు.
కోడెల చనిపోయాక రకరకాలుగా వార్తలొచ్చాయని గుర్తుచేశారు డిప్యూటీ సీఎం సుచరిత. తొలుత గుండెపోటు అని తర్వాత అధిక మోతాదులో ఇంజక్షన్ తీసుకొని చనిపోయారని ప్రచారం జరిగిందని వివరించారు. కోడెల మృతిపై తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు బృందంతో విచారణ జరిపిస్తోందని పేర్కొన్నారు. ఈ అంశం విచారణ పరిధిలో ఉందని .. దాని గురించి ఇప్పుడే మాట్లాడబోనని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నోరు తేరిస్తే చాలు అబద్దాలు వల్లెవేస్తున్నారని విమర్శించారు. కోడెలపై ఏపీ ప్రభుత్వం కేసు పెట్టలేదని .. బాధితుల ఫిర్యాదు మేరకు కోడెల కూతురు, కుమారుడిపై కేసులు నమోదయ్యాయని క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వానికి వచ్చిన మెజార్టీ చూసి తట్టుకోలేకపోతున్నారని .. రాక్షసుల మధ్య కూర్చొలేకపోతున్నామని చంద్రబాబు అనడం ఆయన వైఖరికి అద్దం పడుతుందన్నారు.
చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా మాట్లాడటం లేదన్నారు. అధికారం లేకుండా ఉండలేరని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా కాదు .. సీఎంగా ఉన్నప్పుడు జగన్పై విమర్శలు చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం సీబీఐని రాష్ట్రంలో అడుగుపెట్టనీయమని చెప్పిన చంద్రబాబు .. ఇప్పుడు కోడల ఆత్మహత్య గురించి సీబీఐ విచారణ అడగడం విడ్డూరంగా ఉందన్నారు.