దుష్టశక్తి అవహించింది: వైఎస్ జగన్ను ఏకిపారేసిన పెదబాబు, చినబాబు
అమరావతి: ఏపీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధానిపై సీఎం జగన్ వైఖరి తెలియక వైసీపీ నేతలు రోజుకోమాట మాట్లాడుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని అన్నారు లోకేష్.
దుష్టశక్తి అవహించింది..
రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నారా లోకేష్ ట్వీట్ చేశారు. ‘ఏదైనా ఊరిని దుష్టశక్తి ఆవహించినప్పుడు చెట్లు మాడిపోవడం, ప్రజలు ఎక్కడివక్కడ వదిలేసి వెళ్ళిపోవడం కథల్లో వింటుంటాం. అమరావతి విషయంలో అదే జరిగిందేమో. నాలుగేళ్ళ క్రితం ఇదే రోజున రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడక్కడ చూస్తే ఎడారిని తలపిస్తోంది' అని లోకేష్ వ్యాఖ్యానించారు.
జగన్ మీ వైఖరేంటో చెప్పండి..
‘@ysjagan గారూ! మీ పార్టీ డమ్మీలకు కూడా రాజధాని గురించి మీ వైఖరి ఏమిటో తెలీక రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇంతకీ అమరావతి నిర్మాణానికి మీ దగ్గర ప్రణాళికలు ఏవైనా ఉన్నాయా? లేక రాజధానిని ఇంకెక్కడికైనా తరలిస్తున్నారా? ' అని లోకేష్ ప్రశ్నించారు. మీకోసం రాజధాని ప్రాంతంలో రాజభవనం కట్టుకున్నారు. మరి రాష్ట్రానికి రాజధాని నగరం అక్కర్లేదా? రాజధానిపై మీ వైఖరి ఏంటో మీ నోటితో చెప్పండి అంటూ ప్రశ్నించారు.
అది రిజర్వ్ టెండరింగ్.. కక్ష సాధింపు..
ఇక చంద్రబాబు కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రివర్స్ టెండరింగ్తో రూ. 750 కోట్లు మిగిల్చామని వైసీపీ నేతలు చెబుతున్నారని.. కానీ, రూ. 7,500 కోట్లు నష్టం వస్తుందని అన్నారు. రివర్స్ టెండరింగ్ కాదు.. అది రిజర్వ్ టెండరింగ్ అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
బంగారు బాతును చంపేస్తున్నారు..
సామాజిక మాధ్యమాలపైనా ఆంక్షలు విధిస్తోందని అన్నారు. ప్రతిపక్ష సభ్యులను ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారని.. శ్రీకాకుళం జిల్లాలో కూడా టీడీపీ శ్రేణులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రపంచమంతా అమరావతి గురించి చర్చించుకునేలా చేశానని, హార్వర్డ్ వర్సిటీలో అమరావతిపై కేసు స్టడీ కూడా చేశారని చంద్రబాబు చెప్పారు. బంగారు గుడ్లు పెట్టే బాతును చేతికి ఇస్తే.. దాన్ని చంపేస్తున్నారంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. తనకు మంచి పేరు వస్తుందనే జగన్ ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.