మంచికే మంచి: జగన్ సర్కారుకు చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు
గుంటూరు: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. బుధవారం టీడీపీ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల సంఘ నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు.
తాను మంచికి మంచిగా ఉంటానని.. తేడావస్తే దెబ్బకు దెబ్బ తీస్తానని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అధికారం ఉందికాదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని అన్నారు. రైతు సొంత పొలంలో మట్టి తీసుకుపోవాలన్నా జే టాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
వెంటనే ఉపాధిహామీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేకుంటే జాతీయ స్థాయిలో పోరాడేందుకు సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు. తన కన్ను ఒకటి పోయినా పర్లేదు కానీ.. ఎదుటివారి రెండు కళ్లు పోవాలనేది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వమని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఉపాధి హామీ నిధులను పులివెందుల, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నియోజకవర్గంలో మినహా మరెక్కడా ఇవ్వడం లేదని ఆరోపించారు. దీనిపై చట్టపరంగా కేసులు వేసి పోరాడతామన్నారు.
కేంద్రం విడుదల చేసిన నిధులను మళ్లించడం చట్ట విరుద్ధమని చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా శాశ్వతంగా కోలుకోలేని దెబ్బకొట్టాలని వైసీపీ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు మంగళవారం కూడా జగన్ సర్కారుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రివర్స్ టెండరింగ్తో రూ. 750 కోట్లు మిగిల్చామని వైసీపీ నేతలు చెబుతున్నారని.. కానీ, రూ. 7,500 కోట్లు నష్టం వస్తుందని అన్నారు. రివర్స్ టెండరింగ్ కాదు.. అది రిజర్వ్ టెండరింగ్ అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
సామాజిక మాధ్యమాలపైనా ఆంక్షలు విధిస్తోందని అన్నారు. ప్రతిపక్ష సభ్యులను ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారని.. శ్రీకాకుళం జిల్లాలో కూడా టీడీపీ శ్రేణులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రపంచమంతా అమరావతి గురించి చర్చించుకునేలా చేశానని, హార్వర్డ్ వర్సిటీలో అమరావతిపై కేసు స్టడీ కూడా చేశారని చంద్రబాబు చెప్పారు. బంగారు గుడ్లు పెట్టే బాతును చేతికి ఇస్తే.. దాన్ని చంపేస్తున్నారంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. తనకు మంచి పేరు వస్తుందనే జగన్ ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.