Macherla Attack: అడ్వకేట్ కిశోర్ తలకు బలమైన గాయం, ఎన్ఆర్ఐ ఆస్పత్రికి చంద్రబాబు
మాచర్ల దాడిలో గాయపడ్డ అడ్వకేట్ కిశోర్కు మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బుధవారం జరిగిన దాడిలో గాయపడ్డ తర్వాత మెరుగైన చికిత్స అందలేదని ఎన్ఆర్ఐ వైద్యులు చెబుతున్నారు. తమ పర్యవేక్షణలో కిశోర్ ఆరోగ్య పరిస్థితిని నిశీతంగా పరిశీలిస్తామని వైద్యులు అంటున్నారు. దాడిలో గాయపడ్డ కిశోర్ను పరామర్శించేందుకు ఆస్పత్రికి లాయర్లు బారులుతీరారు.
నిన్నటి దాడిలో కిశోర్ తలకి బలమైన గాయమైన సంగతి తెలిసిందే. దీంతో ఎన్ఆర్ఐ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఆస్పత్రికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వస్తున్నారు. దాడిలో గాయపడ్డ కిశోర్ను చంద్రబాబు నాయుడు పరామర్శిస్తారు. ఈ మేరకు పార్టీ వర్గాలు మీడియాకు తెలియజేశాయి.
స్థానిక సంస్థల నామినేషన్ చివరిరోజు బుధవారం టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు మాచర్ల వెళ్లారు. వారు 10 కార్లతో రావడంతో వృద్ధులు, పిల్లలు హడలెత్తిపోయారని.. కొందరు కారుపై దాడిచేసిన సంగతి తెలిసిందే. విపక్ష టీడీపీ దాడికి సంబంధించిన వీడియోను కూడా మీడియాకు విడుదల చేసింది. దాడి ఘటనపై ఏపీ ప్రభుత్వం కూడా వేగంగా స్పందించింది. దాడి చేసిన తురక కిశోర్, నాగరాజు, గోపిను అరెస్ట్ చేశారు.
తమ నేతల కారుపై దాడి చేసింది వైసీపీ కార్యకర్తలని టీడీపీ ఆరోపించగా.. అధికార పార్టీ తిప్పికొట్టింది. సున్నితమైన పల్నాడులో టీడీపీ నేతలు రెచ్చగొట్టేందుకు పర్యటించారా అని ప్రశ్నించారు. 10 కార్లలో ఎందుకు వచ్చారు అని, గొడవ చేసేందుకే వచ్చారా అని నిలదీశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని ఏపీ హోం మంత్రి సుచరిత హెచ్చరించారు.