జగన్ మామ! చిన్నారులను ఒడిలో కూర్చోబెట్టుకొని అక్షరాలు దిద్దించారు.. (వీడియో)
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నడిచిన బాటలో పయనిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే.. జగన్ కూడా చిన్నారులను అక్కున చేర్చుకున్నారు. వారిని ఒడిలో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించారు. వారి ఉన్నత చదువులకు భరోసా కల్పించారు. పాఠశాలలకు వెళ్లే ప్రతి చిన్నారినీ తాను మామయ్యలా చదవిస్తానని హామీ ఇచ్చారు.
రాజన్న బడిబాట పథకంలో భాగంగా.. శుక్రవారం రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడేపల్లి మండలం పెనుమాకలో వందేమాతరం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ పాఠశాల ఆవరణలో మొత్తం రెండువేల మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది.
అసెంబ్లీ వాయిదా పడిన తరువాత వైఎస్ జగన్ నేరుగా వందేమాతరం ప్రాథమికోన్నత పాఠశాలకు చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన వెంట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, హోమ్ మంత్రి సుచరిత, బాపట్ల లోక్సభ సభ్యుడు నందిగం సురేష్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్, ఇతర అధికారులు ఉన్నారు.
ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన చదువుల తల్లి సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాల వేశారు. పూజ చేశారు. అనంతరం పలువురు చిన్నారులను తన ఒడిలో కూర్చోపెట్టుకుని అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పాదయాత్ర సందర్భంగా తాను ప్రతి తల్లికి, చెల్లికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నందున తనకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. పిల్లలను బడికి పంపిస్తే చాలని, వారికి మామగా అండగా ఉంటానని చెప్పారు. పిల్లలను బడికి పంపించిన తల్లులకు అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఏటా రూ.15 వేలు అందజేస్తామని జనవరి నుంచి ఈ పథకాన్ని అందుబాటులోకి తెస్తామని అన్నారు.