ప్రత్యేక హోదా పై ఇలా: బీజేపీతో సంబంధాల పైనా జగన్ స్పష్టత : వైసీపీ ఎంపీలతో సబ్ కమిటీలు ..!
పార్లమెంట్లోనే కాదు..జాతీయ స్థాయిలో వైసీపీ ఇమేజ్ పెరిగేలా ఎంపీలు వ్యవహరించాలని ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత జగన్ నిర్ధేశించారు. ఏపీకీ ప్రత్యేక హోదా కోసం ఇచ్చేవరకూ పోరాటం చేయాల్సిందేనని స్పష్టం చేసారు. కేంద్రం నుండి ఏపీకీ దక్కాల్సిన నిధుల సాధన కోసం ఎంపీలు కమిటీలు ఏర్పాటై ప్రయత్నాలు కొనసాగిం చాలని సూచించారు. అదే సమయంలో బీజేపీతో సంబంధాల పైనా జగన్ స్పష్టత ఇచ్చారు. పార్లమెంట్లో హుందాగా వ్యవహరించాలని నిర్ధేశించారు.
ఏపీలో 'బంట్రోతు' వ్యాఖ్యల దుమారం .. బాలయ్యకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి
హోదా ఇచ్చేదాకా పోరాటం ఆగదు..
ఏపీకీ ప్రత్యేక హోదా హామీ రాజ్యసభ సాక్షిగా ఇచ్చారని..దానిని సాధించకోకుంటే ఏపీ అభివృద్ది సాధ్యం కాదని ఏపీ సీఎం జగన్ తేల్చి చెప్పారు. హోదా సాధించే వరకూ కేంద్రం పైన ఒత్తిడి తెస్తూనే ఉండాలని పార్టీ ఎంపీలకు దిశా నిర్ధేశం చేసారు. ఢిల్లీలో పార్టీ ఎంపీలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలను నిర్ధేశించారు. హోదా ఏపీకీ ఎందుకు అవసరమో ఎంపీలకు వివరించారు. తాను కూడా నీతి అయోగ్ సమావేశంలో ఇదే అంశం పైన వివరిస్తానని..ఖచ్చితంగా హోదా సాధించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని ఎంపీలకు స్పష్టం చేసారు. అదే సమయంలో సంఖ్యా పరంగా ఉన్న బలాన్ని గుర్తించి ఏపీ గౌరవం..వైసీపీ ఇమేజ్ మరింత పెరిగేలా వ్యవహరించాలని ఎంపీలకు సూచించారు.
బీజేపీతో సంబంధాల పైనా...
ముఖ్యమంత్రి జగన్ జాతీయ స్థాయి రాజకీయాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితుల్లో కేంద్ర సాయం తప్పనిసరిగా కావాలని జగన్ వ్యాఖ్యానించారు. దీని కోసం ఇప్పుడు వారితో సఖ్యతగా ఉంటూ సాధించుకోవాలి కానీ..పోరాటం చేసి ఏం చేయలేమని స్పష్టం చేసారు. బీజేపీతో సన్నిహిత సంబంధాలు రాజకీయాల కోసం కాదు..ఏపీ కోసం అవసరమని చెప్పుకొచ్చారు. పార్లమెంట్లో దేశంలోనే నాలుగో పెద్ద పార్టీగా వైసీపీకి గుర్తింపు దక్కిందని దీనికి తగినట్లుగానే సభ్యులు హుందాగా వ్యవహరించాలని సూచించారు. కేంద్రంలోని అనేక శాఖలతో సంప్రదింపుల కోసం ఎంపీలు కమిటీలుగా డివైడ్ అయి..ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్తో కలిసి ప్రణాళికా బద్దంగా నడుచు కోవాలని సూచించారు. ఒకటికి రెండు సార్లు కేంద్ర మంత్రులతో టచ్లో ఉంటూ ఏపీకీ రావాల్సిన నిధులు సాదించుకో వాలని స్పష్టం చేసారు.
ఎంపీలకు ప్రత్యేక సూచనలు..
పార్లమెంట్లో ఎంపీల వ్యవహార తీరు..వారి శైలి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుందని జగన్ తన పార్టీ ఎంపీ లకు సూచించారు. సభలో జరిగే బిజినెస్ మీద పూర్తి అవగాహన పెంచుకోవాలని..సభలో ప్రస్తావించే అంశాల మీద ముందుగానే పూర్తి సమాచారంతో సిద్దంగా ఉండాలని నిర్ధేశించారు. సాధ్యమైనంత ఎక్కువ చర్చల్లో పాల్గొనటం ద్వారా వ్యక్తిగతంగా ఎంపీలకు..పార్టీకి..ఏపీకీ మంచి జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఏపీ - కేంద్రం మధ్య సత్సంబంధాలు ఉండాలని..అదే సమయంలో కేంద్రం నుండి ఎప్పటికప్పుడు ఏపీకీ రావాల్సిన సాయం పైనా ఎంపీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా సమాలోచనలు చేశారు. సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పనిచేయాలని ఎంపీలకు సూచించారు. శాఖల వారీగా సమస్యల పరిష్కారానికి ఎంపీల బృందం ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు.