ఎందా చాటా? సీటు దొరికిందా?.. గుంటూరు బరిలో అలీ?
గుంటూరు : సినిమా అభిమానం రాజకీయాల్లో పనిచేస్తుందా? హీరోలు గానీ, కమెడియన్లు గానీ ఎన్నికల్లో నిలబడితే గంపగుత్తగా ఓట్లు పడతాయా? సినిమా, రాజకీయం ఒక్కటేనా? పాత ఎన్నికల రీళ్లు తిరగేస్తే అసలు విషయం బోధపడుతుంది. ఇలాంటి ప్రశ్నలకు సవాలక్ష సమాధానాలు దొరుకుతాయి. సినిమాల్లో టాప్ స్థానాల్లో నిలిచిన చాలామంది.. రాజకీయం దగ్గరకు వచ్చేసరికి బొక్కాబొర్లా పడ్డ సందర్భాలున్నాయి. మరి నవ్వుల్లో ముంచెత్తుతూ లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న కమెడియన్ అలీ రాజకీయాల్లో రాణిస్తారా? గుంటూరు తూర్పు అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్న అలీకి అక్కడి ప్రజలు పట్టం కడతారా?
పొలిటికల్ ఎంట్రీ
సినీ నటుడు, కమెడియన్ అలీ రాజకీయ అరంగేట్రానికి ముందడుగు పడినట్లే కనిపిస్తోంది. మొన్నటివరకు ఏ పార్టీలో ఉంటారో తెలియని కన్ఫ్యూజన్ నెలకొన్నప్పటికీ.. చివరకు టీడీపీనే ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలనేది ఆయన అంతరంగంగా తెలుస్తోంది. ఆ మేరకు అలీ గుంటూరులో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గుంటూరు తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న అలీ.. ఆ మేరకు రిటర్నింగ్ అధికారికి ఓటు హక్కు కల్పించాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన దరఖాస్తును స్వీకరించిన అధికారులు.. హైదరాబాద్ లో అలీ ఓటరుగా నమోదైనట్లు గుర్తించారు. అదే విషయం ఆయనకు వివరించారు. దాంతో తెలంగాణలో తనకు ఓటు హక్కు తొలగించినా అభ్యంతరం లేదని.. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మాత్రం ఓటు కావాలని అభ్యర్థించారు.
గుంటూరు తూర్పు నుంచేనా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తిచేశారు. ఆ క్రమంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశారు. తెనాలి సెగ్మెంట్ నుంచి ఆళ్లపాటి రాజా పేరు దాదాపుగా కన్ఫార్మ్ అయినట్లే కనిపిస్తోంది. అదే క్రమంలో గుంటూరు తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్ స్థానానికి కమెడియన్ అలీ పేరు చంద్రబాబు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గుంటూరు పశ్చిమకు కోవెలమూడి రవీంద్ర, మద్దాల గిరి పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వారిద్దరు కాని పక్షంలో కాపు, ఎస్సీ, రెడ్డి సామాజికవర్గం నుంచి ఎవరికో ఒకరికి అవకాశం దక్కనుంది. తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ను పక్కనబెట్టి, బాపట్ల ఎమ్మెల్యే మాల్యాద్రి, డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్లు పరిశీలిస్తున్నారట. అలాగే ప్రత్తిపాడుకు కందుకూరు వీరయ్యతో పాటు డొక్కా కూతురు పేర్లు క్యూ లో ఉన్నాయట. వారిద్దరు కానిపక్షంలో రిటైర్డ్ ఐఎఎస్ అధికార్లలో ఎవరో ఒకరిని తెరపైకి తెచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఇక మంగళగిరి నుంచి కాండ్రు కమల, మరుగుడు హన్మంతరావు, చిరంజీవులు, తిరువీధుల శ్రీనివాసరావు టికెట్ రేసులో ఉన్నారట.
అభిమానం ఓట్లు రాల్చేనా?
కమెడియన్ అలీ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు గుంటూరు తూర్పు నియోజకవర్గం వైపు మొగ్గు చూపారు. అక్కడి నుంచే అసెంబ్లీ బరిలోకి దిగనున్నారు. అయితే దీని వెనుకాల చాలా కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అక్కడ ఎక్కువ ఉంటారనేది ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మొత్తానికి ఇన్నాళ్లు నవ్వులతో ముంచెత్తిన అలీ.. పొలిటికల్ పంచులు ఎలా పేల్చుతారో చూడాలి. మరోవైపు అభిమానం ఎంతమేర ఓట్లు రాల్చుతుందోననేది కూడా చర్చానీయాంశంగా మారింది.