ఆర్కేకు సీఆర్డీఏ..! ఎఫ్డీసీ పై నెలకొన్న తీవ్ర పోటీ..! జగన్ కు తలనొప్పిగా మారిన పదవుల పంపిణీ..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపిలో పదవులు పందేరం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మారిందంటే చట్టసభలకు అవకాశం దక్కని నేతలు నామినేటెడ్ పదవులపై గురిపెడతారు. చట్టసభలకు అవకాశం దక్కిన వారు సైతం మంత్రి పదువులు దక్కలేదని అలిగి.. నామినేటెడ్ పదవుల్లో కీలకంగా ఉన్న వాటిని దక్కించుకునేందుకు పావులు కదుపుతారు. ఇది ఏ రాష్ట్రంలోనైనా జరిగేది. ఇప్పుడు ఏపీలోనూ ఇదే జరుగుతోంది. ఏపీలో టీడీపీ ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. తొమ్మిదేళ్లుగా పదవుల కోసం వేచి ఉన్న వైసీపీ నేతలు.. వాటిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలవడంతో వైసీపీ కూడా అందరికి మంత్రి పదవులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. దీంతో పలువురు ఎమ్మెల్యేలకు కూడా నామినేటెడ్ ఫదవులు ఇచ్చి బుజ్జగించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే పలు పదువులు భర్తీ చేసిన జగన్..! మరిన్ని కీలక పదవుల అభ్యర్థుల కోసం కసరత్తు..!!
ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం వచ్చాక పలు కీలక పదవులు భర్తీ చేసింది. టీటీడీ ఛైర్మన్గా మాజీ ఎంపీ, జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయనకు రాజ్యసభ ఇస్తామని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే.. మరో రెండేళ్ల వరకు రాజ్యసభ సీట్ల భర్తీకి అవకాశం లేకపోవడంతో ఆలోపు ఆయనకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తూ జగన్ నిర్ణయించారు. ఇక మంత్రి పదవి దక్కని చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు కూడా జగన్ నామినేటెడ్ పదవులు అప్పగించారు. చంద్రగిరి నుంచి గెలిచిన చెవిరెడ్డి భాస్కరరెడ్డికి తుడా ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. మంత్రి పదవి దక్కలేదని అలిగిన నగర ఎమ్మెల్యే రోజాను బుజ్జగించి ఏపీఐఐసీ ఛైర్పర్సన్ పదవి అప్పగించారు. అలాగే వుడా ఛైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యుల పదవులు, విజయవాడ దుర్గగుడి ఛైర్మన్ పదవిని త్వరలో భర్తీ చేసేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు.
అందరికి సమ న్యాయం..! సంయమనంతో ముందుకు వెళ్తున్న జగన్..!!
ఇప్పుడు సినీ రంగానికి చెందిన ఓ కీలక పదవి కోసం గట్టి పోటీ ఏర్పడింది. ఈ పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కోసం ముగ్గురు నటులు రేసులో ఉన్నారు. అయితే.. ఈ పదవి సహజనటి జయసుధకు ఇవ్వాలని జగన్కు భావిస్తున్నట్లు సమాచారం. ఈమె వైఎస్ కుటుంబానికి ఆప్తురాలు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాజకీయం అరంగేట్రం చేసి సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2014లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ వైఎస్ కుటుంబంతో సత్సంబంధాలు నడుపుతున్నారు. ఇటీవల ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.
ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్గా ఎవరు..? పోటీలో ముగ్గురు కీలక నేతలు..!!
జయసుధకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని భావించినా.. వీలవ్వలేదు. దీంతో ఆమెకు ఎఫ్డీసీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. నటుడు మోహన్బాబు కూడా ఈ విషయంలో మద్దతుగా తెలుపుతున్నట్లు తెలిసింది. అలాగే హస్యనటులు అలీ, పృద్వీ, పోసాని కృష్ణమురళి రేసులో ఉన్నారు. ఎన్నికల ముందు అలీ వైసీపీలో చేరి పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని చెప్పినా సీటు దక్కలేదు. దీంతో నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే పృథ్వీ, పోసాని కృష్ణమురళి ముందు నుంచి జగన్కు మద్దతుగా నిలిచారు. వైసీపీకి మద్దతుగా పోసాని అయితే ప్రచారం చేస్తూ టీడీపీని విపరీతంగా విమర్శించేవారు. దీంతో వీరు ఎఫ్డీసీ ఛైర్మన్ రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
సీఆర్డీఏ ఛైర్మన్ ఆయనేనా..? ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇచ్చేందుకు జగన్ రెడీ..!!
ఏపీలో సీఆర్డీఏ ఎంతో కీలకంగా మారింది. రాజధాని అభివృద్ధికి సీఆర్డీఏనే కీలకం. దీనికి ఛైర్మన్గా మంగళగిరి నుంచి గెలిచి ఆళ్ల రామకృష్ణారెడ్డిని నియమించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోకవర్గం మంగళగిరి. చంద్రబాబు తనయుడు లోకేష్ ఇక్కడి నుంచే పోటీ చేశారు. ఈయన్ను ఓడించి ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తానని జగన్, ఆయన సోదరి షర్మిల ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా రోజాతోపాటు ఆళ్ల రామకృష్ణారెడ్డికి రెండో విడతలో మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తోంది. ఇది జరగడానికి రెండున్నరేళ్ల సమయం ఉంది. ఈలోపు రోజాకు ఇచ్చినట్లుగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా నామినేటెడ్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఇందుకుగాను రాజధాని ప్రాంతంలో ఉన్నందున సీఆర్డీఏ ఛైర్మన్గా ఆళ్లను నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.