ఏపీలో మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ .. దుర్గమ్మ దర్శనం చేసుకున్న మోహన్ భగవత్
భారతదేశంలో ఉండాలంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించవలసిందే అంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏపీలో రాష్ట్ర పదాధికారుల సమావేశానికి హాజరు అయ్యారు. ఏపీలో తాజా పరిస్థితుల నేపధ్యంలో ఆయన పర్యటనపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఈ నేపధ్యంలో విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. నేడు కనకదుర్గ ఆలయానికి వెళ్లిన మోహన్ భగవత్ కు ఆలయ ఈవో సురేష్, అధికారులు ఘన స్వాగతం పలికారు.
అమ్మవారిని దర్శించుకున్న మోహన్ భగవత్ కు తీర్ధ ప్రసాదాలను అందజేయడంతో పాటుగా, వేద పండితులు వేద ఆశీర్వచనం పలికారు. మోహన్ భగవత్ కు ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సమర్పించారు. దుర్గ గుడిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలను గురించి అధికారులు మోహన్ భగవత్ వివరించారు.
ఈ నేపధ్యంలోనే ఆర్ఎస్ఎస్ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి మోహన్ భగవత్ హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ సమావేశాలలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొననున్నారు. రాష్ట్రంలో ఇటీవల ఆలయాలపై దాడులు , దేవతా విగ్రహాల ధ్వంసం , ఆలయాలలో చోరీలు , రథం దగ్ధం ఘటనల నేపధ్యంలో ఆర్ ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాష్ట్రానికి రావటం ఆసక్తికరంగా మారింది. ఆయన మళ్ళీ ఏం సంచలన వ్యాఖ్యలు చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది. మంగళగిరి రూరల్ పోలీసులు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.