చిన్నారిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ, ఇకపై నేరాల రిజిష్టర్, దిశ చట్టం కూడా..
ఏపీలో దిశ చట్టాన్ని అమలు చేసి నేరానికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షిస్తామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఇకపై నేరాలు చేయాలంటే భయపడాలని ఆమె అభిప్రాయపడ్డారు. శిక్షలు కఠినంగా ఉంటాయని చెప్పారు. అంతేకాదు నేరాలకు సంబంధించిన రిజిష్టర్ నమోదు చేస్తామని తెలిపారు. ఆమె శనివారం గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఐదేళ్ల చిన్నారిని పరామర్శించారు.
చిన్నారిపై లైంగికదాడి బాధ కలిగిస్తోందని వాసిరెడ్డి పద్మ అన్నారు. తమతో సన్నిహితంగా మెలిగే వ్యక్తే దారుణానికి ఒడిగడతాడని వారు ఊహించలేదని చెప్పారు. దిశ ఘటన తర్వాత చట్టాన్ని అమలు చేయబోతున్నామని చెప్పారు. చిన్నారులు, మహిళలపై లైంగికదాడి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దిశ చట్టంపై క్షేత్రస్థాయిలో చర్చ జరగాలని వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. మహిళా కమిషన్ ప్రజల్లోకి తీసుకెళ్తుందని చెప్పారు. లైంగికదాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని.. అతనికి కఠిన శిక్ష అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
గుంటూరు నగరపాలెం పోలీసుస్టేషన్ పరిధిలో వివాహిత ఉంటోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు.. కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే భర్తతో విడాకులు తీసుకొని తన తల్లి ఇంటి వద్ద ఉంటూ నర్సుగా పనిచేస్తోంది. చిన్నారి ఇంటికి సమీపంలోని పాఠశాలలో చదువుతుంది. శుక్రవారం మధ్యాహ్నం చిన్నారి తల్లి డ్యూటీకి వెళ్లగా.. గంట తర్వాత అమ్మమ్మ రైతు బజారుకు వెళ్లింది. తర్వాత పై పోర్షన్లోకి వచ్చిన తాడిపత్రి లక్ష్మారెడ్డి చిన్నారిపై లైంగికదాడి చేశారు. ఇంటికొచ్చిన తర్వాత చిన్నారి తల్లికి విషయం చెప్పడంతో పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు.