కన్న కూతురే... వృద్ద తల్లిదండ్రుల పట్ల నిర్దాక్షిణ్యంగా... బతికి ఏం సాధిస్తారని...
ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరినీ బాగా చదివించారు. ఒక కుమార్తెకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో సంతోషపడ్డారు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసి పంపించారు. అయితే వృద్దాప్యంలో ఇద్దరు కుమార్తెల్లో ఎవరూ తమవైపు చూడకపోవడంతో ఆవేదన చెందారు. వయసు మీద పడటంతో పాటు అనారోగ్యం కూడా తోడవడంతో... ఉన్న కొద్దిపాటి భూమిని అమ్మి వైద్యం చేయించుకోవాలనుకున్నారు. కానీ కన్న కూతురే అందుకు పడింది. ఈ వయసులో మీరు బతికి సాధించేది ఏంటని సూటి పోటి మాటలతో వారిని కుమిలిపోయేలా చేసింది. అంతేకాదు,వారి చేతిలో ఓ పురుగుల మందు డబ్బా పెట్టి... తాగి చనిపోవాలని హెచ్చరించింది. గుంటూరులో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇదీ నేపథ్యం...
గుంటూరు జిల్లా రెంటచింతల మండలం మంచిగల్లుకు చెందిన ఖాసీం సైదా-మస్తాన్ బీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే మస్తాన్ బీ దంపతులు ఇద్దరు కుమార్తెలను బాగానే చదివించారు. ఈ క్రమంలో ఒక కుమార్తెకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో సంబరపడ్డారు. వృద్దాప్యంలో తమ బాగోగులు చూసుకుంటుందని ఆశించారు. కానీ వాళ్ల ఆశలు అడియాశలే అయ్యాయి. పైగా కూతురి నుంచే బెదిరింపులు వస్తుండటంతో తట్టుకోలేక తల్లడిల్లుతున్నారు.
పొలం తాకట్టు పెట్టి సర్జరీ..
ఇద్దరికీ పెళ్లి చేసి పంపించాక సైదా-మస్తాన్బీ దంపతులు ఒంటరైపోయారు. బిడ్డలు తమను పట్టించుకోకపోవడంతో బెంగ పెట్టుకున్నారు. ఇదే క్రమంలో సైదా గుండె జబ్బు బారినపడ్డారు. కుమార్తెలతో చెప్తే వారు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సైదాను ఎలాగైనా కాపాడుకోవాలని మస్తాన్బీ ఆయన్ను తీసుకుని గుంటూరు పట్టణం వచ్చారు. ఊరిలో ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టి... ఆ డబ్బులతో సైదాకు సర్జరీ చేయించారు. అనంతరం అక్కడే చుట్టుగుంటలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఓ చిన్నపాటి పాన్ డబ్బా పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.
రంగంలోకి కుమార్తె... బెదిరింపులు...
78 ఏళ్ల వయసులో సైదా మళ్లీ అనారోగ్యం బారినపడ్డారు. కొన్నాళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు చికిత్స చేయించేందుకు ఊరిలో ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని రూ.2లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నారు. అయితే ఈ విషయం తెలిసి కానిస్టేబుల్గా పనిచేస్తున్న కుమార్తె దీనికి అడ్డు తగిలింది. భూమి అమ్మడానికి వీల్లేదని చెప్పింది. కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తిని కూడా బెదిరించింది.
Recommended Video
ఈ వయసులో బతికి ఏం సాధిస్తారు...
ఈ వయసులో బతికి ఏం సాధిస్తారంటూ తల్లిదండ్రులను సూటిపోటి మాటలతో వేధించింది. అంతేకాదు,ఓ పురుగుల మందు డబ్బా చేతిలో పెట్టి 'తాగి చావండి' అని హెచ్చరించింది. దీంతో తల్లడిల్లిపోయిన ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కుమార్తె నుంచి తమకు ప్రాణ హాని ఉందని,రక్షణ కల్పించాలని కోరారు. నడవలేని స్థితిలోనూ తమను వద్దకు వచ్చి ఆవేదనను చెప్పుకున్న వృద్ద దంపతులను చూసి పోలీసులు కూడా చలించిపోయారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని డీఎస్పీ అధికారులను ఆదేశించారు.