అభివృద్ధి అంటే విభజించటం కాదు.. పార్లమెంట్ లో రాజధాని కోసం పోరాడతా : గల్లా జయదేవ్
ఏపీలో మూడు రాజధానుల అంశంపై రగడ కొనసాగుతుంది. రాజధాని గ్రామాల్లో ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. రాజధాని రైతుల పోరాటం 20వ రోజుకు చేరుకున్నా ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని తేల్చి చెప్తుంది. ఇక ఈ అంశంపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ వేదికగా పోరాటం సాగిస్తానని చెప్పారు.అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీని సీఎం వైసీపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయం మరింత ఆర్థిక భారాన్ని పెంచుతుందని ఆయన మండిపడ్డారు.
మందడంలో రైతుల దీక్షలకు మద్దతు తెలిపిన గల్లా
అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ అధికార వికేంద్రీకరణ కాదని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. అభివృద్ధి అంటే విభజించటం కాదన్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ఏపీ ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు ఆయన మద్దతు తెలిపారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మందడంలో రైతులను కలిసి వారికి తన మద్దతు ప్రకటించటమే కాదు పార్లమెంట్ వేదికగా పోరాడతానని హామీ ఇచ్చారు .
అభివృద్ధి పేరుతో విభజిస్తే ఖర్చు పెరుగుతుంది
పెయిడ్ ఆర్టిస్టులంటూ రైతులు, మహిళలను కించపరిచే వారు సిగ్గుపడాలని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో విభజించుకుంటూ పోతే ఖర్చు పెరుగుతుంది తప్ప ఆదాయం రాదని గల్లా జయదేవ్ ఎద్దేవా చేశారు . అమరావతిని మూడు ముక్కలు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించిన గల్లా రాజధానుల ప్రకటన ముందే ప్లాన్ చేశారని ఆరోపించారు. నివేదికలు రాక ముందే సీఎం జగన్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.
ప్రజల దృష్టిమరల్చే యత్నం.. మూడు రాజధానుల ప్రకటన అన్న గల్లా
మందడంలో శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేశారని గల్లా జయదేవ్ కు మహిళలు ఎంపీ గల్లా జయదేవ్ కు ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేయడమే కాకుండా కేసులు కూడా బనాయించారని వారు వాపోయారు .ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అమరావతిలో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే ఇప్పుడు ఇలాంటి గందరగోళ పరిస్థితులను తీసుకు వచ్చిందని ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు.