ప్రేమ పెళ్లికి 'నో' చెప్పిన పెద్దలు.. నవదంపతులపై దాడి
అవనిగడ్డ : ఔను.. వాళ్లు ఇష్టపడ్డారు. మనసులు కలవడంతో ప్రేమికులయ్యారు. ఇక పెళ్లి చేసుకుని హాయిగా కలిసుందామని డిసైడయ్యారు. కానీ వాళ్ల ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు. నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. యువతి తరపు కుటుంబ సభ్యులు నో అన్నారు. ప్రేమ లేదు, పెళ్లి లేదు అంటూ కొట్టిపారేశారు. చివరకు పెద్దలు ఒప్పుకోవడం లేదని ఆ ప్రేమికులు పెళ్లికి సిద్ధమయ్యారు.
గుంటూరు జిల్లా రేపల్లె మండలం అరవపల్లికి చెందిన వేపూరి గోపి (23సం.), అదే గ్రామానికి చెందిన పూజిత(20సం.) అనే అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరి అభిరుచులు ఒకటే కావడంతో ఆ అమ్మాయి కూడా అతడి ప్రేమకు అంగీకారం తెలిపింది. అలా గత కొన్ని నెలలుగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని భావించారు. కానీ అది సాధ్యపడలేదు.
ఇంట్లో వాళ్ల అంగీకారంతో పెళ్లి చేసుకుందామని ఎంత ప్రయత్నించినా.. పెద్దలు మాత్రం నో చెప్పారట. దాంతో ఏమి చేయలేక ఇంట్లోంచి వెళ్లిపోయి అన్నవరం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అలా ఇద్దరు ఒకటైనప్పటికీ యువతి ఇంటోళ్లకు తెలిసి భగ్గుమన్నారు.
తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారనే కోపంతో ఆ నవదంపతులపై యువతి కుటుంబ సభ్యులు కోపం పెంచుకున్నారు. వివాహం చేసుకుని తమ స్వగ్రామానికి తిరిగివస్తున్న తరుణంలో పులిగడ్డ టోల్గేట్ దగ్గర దాడి చేశారు. గోపిని తీవ్రంగా కొట్టి పూజితను ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనపై గోపి అవనిగడ్డ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.