కరోనా కాటు: వైఎస్ క్లాస్మేట్, తెనాలి మాజీ ఎమ్మెల్యే మృతి: అత్యవసర చికిత్స అందిస్తోన్నా
తెనాలి: రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోంది. వందలు దాటి.. వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రోజూ పదుల సంఖ్యలో ప్రజలను బలి తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ బారిన పడి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది మరణించారు. రెండు చోట్లా పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. హోమ్ క్వారంటైన్లు, ఐసొలేషన్ వార్డులకు పరిమితం అయ్యారు.
ఏపీ అసెంబ్లీపై కరోనా కాటు: మరో తొమ్మిదిమందికి పాజిటివ్: ల్యాబుల్లో మరిన్ని రిపోర్టులు
తాజాగా కరోనా వైరస్ మాజీ ఎమ్మెల్యేను బలి తీసుకుంది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్ మరణించారు. కరోనా సోకిన ఆయన కొద్దిరోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం కన్నుమూశారు. కొద్దిరోజుల కిందటే కరోనా లక్షణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.
1994-1999 మధ్యకాలంలో ఆయన గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహించారు. తెలుగుదేశం పార్టీ తరఫున రావి రవీంద్రనాథ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అంతకుముందు- తెనాలి మున్సిపాలిటీ ఛైర్మన్గా పనిచేశారు. రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. టీడీపీలో చాలాకాలం పాటు కొనసాగారు. అనంతరం క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు. అనారోగ్యానికి గురైన తరువాత ఆయన హైదరాబాద్లోని తన కుమార్తె వద్ద నివసిస్తున్నారు.
కర్ణాటకలోని గుల్బర్గాలో ఆయన వైద్యవిద్యను అభ్యసించారు. ఎంబీబీఎస్ డాక్టర్గా తెనాలిలో గుర్తింపు పొందారు. రాజకీయంగా ఆయన ఎదగడానికి డాక్టర్ వృత్తి కూడా దోహద పడిందని చెబుతుంటారు. గుల్బర్గాలో చదువుకుంటున్న సమయంలో రవీంద్రనాథ్.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి క్లాస్మేట్గా ఉండేవారని అంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రవీంద్రనాథ్ ఒక ఏడాది జూనియర్ అని తెలుస్తోంది.